Nara lokesh: సిటీ ఆఫ్ డెస్టినీకి వచ్చిన నరేంద్ర మోదీకి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామని మంత్రి లోకేష్ అన్నారు. విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ సభలో ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ..
” ప్రతి భారతీయుడి హృదయంలో నమో ఉన్నారు. ఇవాళ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందంటే అందుకు కారణం నమో. ఆయన ప్రధాని అనే పదానికి అర్థం మార్చారు. గతంలో ప్రధానులుగా ఉన్నవారు కేవలం ప్రధానిగానే ఉండగా, నేడు మన నమో ప్రజలమనిషిగా మారారు.
నమో విజన్ ఎప్పుడూ ప్రపంచస్థాయిలో ఉంటుంది, కానీ ఆయన హృదయం మాత్రం భారత్ తోనే ఉంటుంది. నమో అంటే పేదల విశ్వాసం… పేదల చిరునవ్వు నమో… యువత భవిత్యుమనిషి నమో… మహిళల ఆత్మగౌరవం నమో. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తారని నమో కృషి చేస్తున్నారు.
విజన్ ఉన్నవారు ప్రపంచాన్ని చూస్తారు. చంద్రబాబు విజన్ 2020 గురించి కొంతమంది ఎగతాళి చేసారు, కానీ ఇవాళ హైదరాబాద్ వెళ్లి చూస్తే ఆయన చెప్పిన ప్రతిదీ నిజమైంది. ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. గత ప్రభుత్వ నిర్వాకంతో వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్ అందించారు.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు నిలబెట్టేందుకు మన సీబీఎన్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. రూ.1000 పెన్షన్ పెంచేందుకు గత ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది, కానీ మన సీబీఎన్ ఒకే ఒక్క సంతకంతో పెన్షన్ రూ.1000 పెంచారు. మూసేసిన అన్న క్యాంటీన్లను తెరిచారు… దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. త్వరలోనే మెగా డీఎస్సీ రాబోతోంది… దటీజ్ సీబీఎన్.
ఇవాళ చరిత్రలో నిలిచిపోవలసిన రోజు. రాష్ట్ర దశ, దిశ మార్చే రూ.2 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఉత్తరాంధ్ర కల అయిన విశాఖ రైల్వే జోన్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, అనేక రోడ్ల ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నారు.
అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం. మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. 2014 నుండి 2019 వరకు జరిగిన అభివృద్ధిని మీరు అందరూ చూశారు. అదే 2019 నుండి జరిగిన విధ్వంసాన్ని కూడా అందరూ చూశారు. మరోసారి మోదీకి ఏపీ ప్రజల తరఫున బేషరతుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటూ నారా లోకేశ్ తన ప్రసంగంముగించారు.