MLC: పార్టీ కోసం కష్టపడ్డాం… సీటు కూడా త్యాగం చేశాం. గత పదేళ్లు పోరాడిన మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో గుర్తింపు దక్కడం లేదు. అధికార పార్టీలో ఉండి కూడా అపోజిషన్లో ఉన్నట్లే ఉందని కొందరు కాంగ్రెస్ నేతలుతెగ బాధపడిపోతున్నారు. త్వరలో ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.వచ్చే ఏడాదిలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. సంఖ్యా పరంగా అధికార పార్టీ కాంగ్రెస్కు నాలుగు స్థానాలు దక్కనున్నాయి. కాంగ్రెస్కు దక్కే నాలుగు సీట్లను సామాజిక సమీకరణాల ప్రకారం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోంది. రెండు బీసీలకు… ఒకటి ఎస్సీకి… మరొకటి రెడ్డి సామాజికవర్గం నేతకు ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
MLC: రెడ్డి సామాజికవర్గం నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కే అవకాశం ఉండటంతో ఎవరా లక్కీ పర్సన్ అనేది కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.ఒక్క బెర్త్ కోసం ఆరుగురు నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గట్టిగా ఎమ్మెల్సీ కోసం పట్టుబడుతున్నారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పదవీ కాలం మార్చితో ముగుస్తుంది. ఈ సారి గ్రాడ్యుయేట్ స్ధానం నుంచి పోటీ చేయబోనని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన… ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లోకి రావడంపై జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు గౌరవం ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీని చేయాలని జీవన్రెడ్డి కోరుతున్నారని టాక్ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ఒకే దెబ్బకు రెండు పిట్టలు… రేవంత్ మాస్టర్ ప్లాన్
MLC: ఇక మరో సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. పైకి బయట పడకపోయినా… పార్టీ ముందు తన ప్రతిపాదనను ఉంచారు.రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే జగ్గారెడ్డి వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతో ఇంతో పాజిటివ్గానే ఉన్నారనే టాక్ వినిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కూడా తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో వనపర్తి టికెట్ ఆశించిన దక్కకపోవడంతో ఈ సారి ఎమ్మెల్సీ వస్తుందనే ధీమాతో యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఉన్నారు. యువనేత పట్ల సీఎం రేవంత్ రెడ్డితో పాటు…పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.
MLC: ఇక ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన పారిజాత నర్సింహారెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా కోటాతో పాటు…చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ మిస్ కావడంతో… ఎమ్మెల్సీగానైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకురాలు..పైగా ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ కావడంతో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి కూడా..పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కని మరో నేత మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కనప్పుడు… తర్వాత వచ్చే అవకాశాల్లో మొదటి ప్రాధాన్యం ఉంటుందని ఇచ్చిన హామీని ప్రస్తావిస్తున్నారు.