Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పతాకస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ ముఖ్యనేతలు ఢిల్లీలోనే మకాం వేసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సురేఖ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చిస్తుండగా.. అటు మంత్రి కొండా సురేఖ ఏమాత్రం తగ్గకుండా ‘నో కాంప్రమైజ్’ ధోరణిని ప్రదర్శించారు. తనపై అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలకు సిద్ధమవుతోందన్న వార్తల వేళ, ఆమె నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సుదీర్ఘంగా సమావేశమై రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను వివరించారు. ఖర్గే భేటీ అనంతరం మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన కొండా సురేఖ.. సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
బీసీ వర్గానికేనా చర్యలు? – తాడోపేడోకి సిద్ధం..
హైకమాండ్కు చెప్పాల్సింది స్పష్టంగా చెప్పానని, వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దామని వ్యాఖ్యానించిన కొండా సురేఖ.. సీఎం రేవంత్రెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమైనట్లు సంకేతాలిచ్చారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధమని ఆమె తేల్చిచెప్పడంతో ఇప్పుడు ఏఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
