Home Minister Anitha: “కడప గడ్డ టీడీపీ బలమున్న ప్రాంతమని చంద్రబాబు గారు మరోసారి నిరూపించారు. పాలకులు ఐదేళ్ల గురించి ఆలోచిస్తారు, కానీ 20 ఏళ్ల ముందే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేవారు నిజమైన విజనరీ నాయకుడు. అలాంటి నేత చంద్రబాబు గారే,” అని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. 75 ఏళ్ల వయసులోనూ 2047 నాటికి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారని చెప్పారు. గత పాలనలో యువతకు ఉపాధి అవకాశాలు తగ్గాయని, వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర పార్టీకి శక్తినిచ్చిందని, నిన్న మహానాడులో తీసుకున్న ఆరు తీర్మానాలు రాబోయే అభివృద్ధికి పునాది కాబోతున్నాయని పేర్కొన్నారు.
వైఎస్ కుటుంబం వల్ల కలిగింది హింసే: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కార్యకర్తల కృషితో జిల్లాలో కూటమి విజయవంతమైందని చెప్పారు. జగన్ రెడ్డి పాలనలో జిల్లాలో అభివృద్ధికి ఏమాత్రం సహకారం లేదని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలను అణచివేయాలన్న నాశనకర రాజకీయాలు మాత్రమే చేశారు అన్నారు. “వైఎస్ కుటుంబం దగ్గర ఉంటే మాకు దక్కిందేమిటంటే హింసే. అందుకే ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీలోకి వచ్చాం,” అని స్పష్టం చేశారు. హంద్రీనీవా, గాలేరు ప్రాజెక్టుల అభివృద్ధికి చంద్రబాబే కృషి చేశారని గుర్తుచేశారు.
రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు కృషి: మంత్రి సవిత
పెనుగొండ ఎమ్మెల్యే, కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత మాట్లాడుతూ, “రాయలసీమను ఒకప్పుడు ఫ్యాక్షన్ సీమగా చూశారు. అయితే చంద్రబాబు గారి పాలనలో ఇది అభివృద్ధి మార్గంలోకి వచ్చింది,” అన్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మహిళలకు భద్రతను, యువతకు ఆశను ఇచ్చిందని చెప్పారు. మహానాడులో ప్రజలు చూపిన స్పందన చూసి వైఎస్ జగన్ రెడ్డి గారు తలచుకోలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
కడప గడ్డకు గౌరవం: ఎమ్మెల్యే మాధవి రెడ్డి
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాట్లాడుతూ, తిరుమలేశుని తొలి గడప అయిన కడపలో మహానాడు జరగడం గర్వకారణమని తెలిపారు. భారీగా హాజరైన ప్రజలు కడప టీడీపీ గడ్డ అని నిరూపించారని చెప్పారు. టీడీపీ బడుగు, బలహీన వర్గాల పార్టీ అని, క్రమశిక్షణకు, పట్టుదలకు, అభివృద్ధికి మరో పేరు చంద్రబాబు నాయుడేనన్నారు. పోలవరాన్ని పూర్తిచేసి కృష్ణా నీటిని రాయలసీమ వరకు తీసుకురావడమే చంద్రబాబు దూరదృష్టికి ఉదాహరణ అన్నారు. గతంలో తనపై వ్యక్తిగత దాడులు జరిగాయని గుర్తుచేస్తూ, టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తే సహించబోమని హెచ్చరించారు.