AP News: ఆంధ్రప్రదేశ్లో రైల్వే భద్రతను ప్రశ్నించేలా గుర్తుతెలియని దుండగులు ఘాతుకానికి ఒడిగట్టారు. గురువారం తెల్లవారుజామున కదులుతున్న రైలు ఇంజిన్ను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో రైలు ముందు భాగంలో ఉండే విండ్షీల్డ్ (అద్దం) పూర్తిగా పగిలిపోయింది. ఆ గాజు ముక్కలు, రాళ్లు బలంగా తగలడంతో విజయవాడకు చెందిన లోకో పైలట్ జయరామ్ తీవ్రంగా గాయపడ్డారు.
సింగరాయకొండ సమీపంలో ఘటన
ఢిల్లీ నుంచి బయలుదేరి చెన్నై వైపు వెళ్తున్న ప్రముఖ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ (12616) రైలు గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోకి చేరుకుంది. రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా చీకట్లోనే దుండగులు ఇంజిన్పై రాళ్లు రువ్వారు. ఈ ఆకస్మిక దాడితో రైలు అద్దాలు పగిలి లోపల ఉన్న లోకో పైలట్ జయరామ్కు తీవ్ర గాయాలయ్యాయి.
ఉలవపాడులో అత్యవసర నిలిపివేత.. పైలట్ సేఫ్!
దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, లోకో పైలట్కు ప్రథమ చికిత్స అందించడం కోసం రైలును తదుపరి స్టేషన్ అయిన ఉలవపాడు రైల్వే స్టేషన్లో అత్యవసరంగా నిలిపివేశారు.గాయపడిన లోకో పైలట్ జయరామ్ను రైల్వే వైద్య సిబ్బంది తక్షణమే సమీపంలోని రైల్వే ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందించారు.ప్రస్తుతం జయరామ్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ధృవీకరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రంగంలోకి రైల్వే పోలీసులు.. కఠిన చర్యలకు డిమాండ్!
కదులుతున్న రైలుపై, అందునా లోకో పైలట్పైనే దాడి జరగడాన్ని రైల్వే శాఖ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు (GRP/RPF) కేసు నమోదు చేసుకుని, నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తును ముమ్మరం చేశారు.
మరోవైపు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు జయరామ్ను పలువురు ఉన్నత రైల్వే అధికారులు, రైల్వే కార్మిక సంఘాల నాయకులు స్వయంగా వెళ్లి పరామర్శించారు. రైలు ప్రయాణికులతో పాటు నడిపే సిబ్బంది ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ఇలాంటి దాడులకు తెగబడిన బాధ్యులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
ఏపీలో కదిలే రైలు ఇంజన్పై రాళ్ల దాడి చేసిన దుండగులు
ఢిల్లీ నుండి చెన్నై వెళ్తున్న రైలుపై సింగరాయకొండ సమీపంలో రాళ్ల దాడి
దాడిలో తీవ్రంగా గాయపడిన సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ జయరామ్
సమీపంలోని Upd స్టేషన్లో రైలు ఆపి, గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించిన అధికారులు pic.twitter.com/XiciPjSSPH
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2026
