Lok Sabha Seats: దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన మార్పుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల సంఖ్యను భారీగా పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రతిపాదించింది. ఇప్పుడున్న 543 స్థానాలను ఏకంగా 850కి పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టి, పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎంపీ సీట్లను కేటాయించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
ఈ ప్రతిపాదన ప్రకారం, మొత్తం 850 సీట్లలో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఇందులో మరో కీలక అంశం ఏమిటంటే, కొత్తగా పెరిగే సీట్లలో కూడా 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు వర్తింపజేయనున్నారు. ఈ మార్పులన్నీ అమల్లోకి వస్తే, 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి దేశంలో కొత్త లోక్సభ ముఖచిత్రం కనిపిస్తుంది.
ఈ భారీ మార్పుపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించనుంది. ఇందుకోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురాబోతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 55, 81లకు సవరణలు చేయడం ద్వారా సీట్ల సంఖ్య పెంపు, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన వంటి అంశాలకు చట్టబద్ధత కల్పిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంపీలందరికీ సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రక్రియ పూర్తయితే లోక్సభలో ప్రజల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయి? దక్షిణాది రాష్ట్రాల ప్రభావం ఎలా ఉంటుంది? అనే అంశాలపై ప్రత్యేక సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల పార్లమెంట్ భేటీలు దేశ భవిష్యత్తు రాజకీయాలను నిర్ణయించడంలో కీలకం కానున్నాయి.
