GHMC: హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో తీర్చిదిద్దే దిశగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అడుగులు వేస్తోంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 11,460 కోట్ల భారీ బడ్జెట్ ముసాయిదాకు కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి బడ్జెట్ కేటాయింపులను సుమారు రూ. 745 కోట్లు పెంచడం విశేషం. నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, జీహెచ్ఎంసీలో విలీనమైన 27 స్థానిక సంస్థల పరిధిలోని అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని అధికారులు ఈ ప్రతిపాదనలను సిద్ధం చేశారు.
ఈ బడ్జెట్లో సింహభాగం నిధులను నగర రహదారుల రూపురేఖలు మార్చేందుకు కేటాయించారు. ముఖ్యంగా ‘సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం’ (CRMP), ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ (H-CITI) ప్రాజెక్టుల ద్వారా ప్రధాన రహదారులు, వంతెనల ఆధునీకరణకు పెద్దపీట వేశారు. మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ రూ. 90 కోట్ల గ్రీన్ బడ్జెట్ను, పారిశుధ్యం మరియు ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రూ. 746 కోట్లను కేటాయించారు. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియలకు ప్రాధాన్యతనిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వ్యూహాలు రచించారు.
ఇది కూడా చదవండి: New Year-2026: న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటున్నారా? మీకు ఈ 10 నిబంధనలు తెలియాల్సిందే..
ఆదాయ వనరుల విషయానికి వస్తే, ఆస్తి పన్ను ద్వారా రూ. 2,245 కోట్లు, భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ. 1,200 కోట్లు సమకూరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల రూపంలో రూ. 3,100 కోట్లు అందుతాయని ఆశిస్తుండగా, ఇతర రుణాల ద్వారా రూ. 800 కోట్లు సేకరించాలని నిర్ణయించారు. దీనివల్ల జీహెచ్ఎంసీ రెవెన్యూ ఆదాయం రూ. 6,441 కోట్లుగా ఉండవచ్చని ముసాయిదాలో పేర్కొన్నారు.
బడ్జెట్తో పాటు నగరవాసుల సౌకర్యార్థం స్టాండింగ్ కమిటీ పలు కీలక ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. బంజారాహిల్స్లోని ఎన్బీటీ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను కన్వెన్షన్ హాల్గా మార్చడం, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ‘హైదరాబాద్ స్కల్ప్చర్ పార్క్’ ఏర్పాటు చేయడం వంటి వినూత్న అంశాలు ఇందులో ఉన్నాయి. పాలనలో సాంకేతికతను జోడిస్తూ, జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్బాట్, ఆటోమేటెడ్ ఫారమ్-ఫిల్లింగ్ సేవలను ప్రవేశపెట్టేందుకు టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు.
అంతేకాకుండా, మియాపూర్ మరియు అమీన్పూర్లలో భూసేకరణ ప్రక్రియలు, చందానగర్లో స్మశానవాటిక అభివృద్ధి, కోటి ఎస్బీఐ సమీపంలోని జంబాగ్లో బాక్స్ డ్రెయిన్ నిర్మాణం వంటి స్థానిక సమస్యల పరిష్కారానికి కూడా ఆమోదం లభించింది. స్టాండింగ్ కమిటీ ఆమోదించిన ఈ బడ్జెట్ ముసాయిదాను వచ్చే నెల రెండో వారంలో నిర్వహించే ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ చర్చించి ఆమోదం పొందిన అనంతరం తుది అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు.
