Malla Reddy: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మల్లారెడ్డి తన పార్టీ మార్పుపై వస్తున్న వార్తలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఆయన బిజెపిలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీ మారే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్లు కాదని ఆయన హితవు పలికారు.
ఇటీవల ప్రధాని మోడీతో భేటీ అయినప్పటి నుండి మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన కొంత ఆవేశంగా స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పుకారుకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. నిరాధారమైన ఆరోపణలను నమ్మవద్దని కోరుతూ ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు. దీంతో ఆయన పార్టీ మార్పు ప్రచారానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది.
మరోవైపు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ‘ఏఐ క్యాంపస్’ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించామని, ఆ కారణంతోనే బీజేపీ నేతలను కలుస్తున్నామని ఆమె వివరించారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని క్లారిటీ ఇచ్చారు. కేవలం బీజేపీనే కాకుండా అన్ని పార్టీల నేతలను తాము ఆహ్వానిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
మల్లారెడ్డి కుటుంబం ఇచ్చిన వివరణతో రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలకు కొంత బ్రేక్ పడింది. అయితే మల్లారెడ్డి లాంటి కీలక నేత ప్రధానిని కలవడం, ఆయన కోడలు బీజేపీ ఆఫీస్కు వెళ్లడం వంటి పరిణామాలు రాజకీయంగా ఆసక్తిని రేపుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి మల్లారెడ్డి గులాబీ జెండా నీడలోనే ఉంటానని చెబుతున్నా, భవిష్యత్తులో రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయో వేచి చూడాలి.
