Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి కేవలం భూముల అమ్మకాలే కేంద్రంగా పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత టి. హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 22ఏ (22A) నిషేధిత ఆస్తుల బాధితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో చేర్చుతూ.. ప్రభుత్వమే స్వయంగా ప్రజల ఆస్తుల పాలిట పెద్ద కబ్జాదారుగా మారిందని ఆయన ఆరోపించారు..
కేసీఆర్ పాలనలో సంక్షేమం – కాంగ్రెస్ హయాంలో రియల్ ఎస్టేట్ దందా..
-
కేసీఆర్ పాలన ప్రగతిపథం: గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ముందుగా ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, 24 గంటల నిరంతర విద్యుత్, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను దాటి తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. కేసీఆర్ ప్రతి అడుగు పేదల బతుకులు మార్చేందుకే వేశారు.
-
రూ.30 వేల కోట్ల భూములు విక్రయం: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రూ.30,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించింది. పార్కులు, లేఅవుట్ ఓపెన్ ప్లాట్లను కూడా వదలకుండా అమ్మేస్తూ.. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి కూడా స్థలాలు లేకుండా చేస్తోంది.
22ఏ జాబితాతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు..
నిషేధిత జాబితా (22A) వ్యవహారంపై హరీశ్రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.. సాధారణ ప్రజలు కొనుగోలు చేసుకున్న స్థలాలను, రిజిస్టర్డ్ ప్లాట్లను అకారణంగా 22ఏ జాబితాలో పెట్టి వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల భూములను బెదిరించి సేకరించి తమ స్వప్రయోజనాల కోసం అనుకూలమైన వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు.
