Jobs: దేశంలో దసరా, దీపావళి పండుగల సీజన్ సమీపిస్తుండటంతో స్మార్ట్ఫోన్ బ్రాండ్లు, ప్రముఖ రిటైల్ స్టోర్లు తాత్కాలిక (సీజనల్) ఉద్యోగుల నియామకాలను భారీగా ముమ్మరం చేశాయి. స్టాఫింగ్ కంపెనీల అంచనాల ప్రకారం, ఈ పండుగల సీజన్లో కేవలం స్మార్ట్ఫోన్ల అమ్మకాల కోసమే దాదాపు 39,600 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 34 శాతం ఎక్కువ.
ఫోన్ల ధరలు పెరిగితే.. రిక్రూట్మెంట్ ఎందుకు పెరిగింది?
సాధారణంగా స్మార్ట్ఫోన్ల ధరలు పెరిగితే అమ్మకాలు తగ్గి ఉద్యోగాలు తగ్గుతాయని అనుకుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్లో ఉంది:
కస్టమర్లను ఒప్పించేందుకే ఎక్కువ మంది..
మార్కెట్లో స్మార్ట్ఫోన్ల ధరలు విపరీతంగా పెరగడంతో కొనుగోలుదారులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో కస్టమర్లకు మొబైల్ ఫీచర్లను స్పష్టంగా డెమో ఇవ్వడం, వారి అవసరాలకు తగిన ఫోన్ను ఎంపిక చేయడంలో సహాయపడటం అత్యంత కీలకంగా మారింది.
ఈఎంఐ, ఫైనాన్స్ సదుపాయాలు..
ధరలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఈఎంఐ (EMI) లేదా ఫైనాన్స్ ద్వారానే ఫోన్లు కొంటున్నారు. స్టోర్లలో కస్టమర్లకు సులభంగా లోన్లు, ఫైనాన్స్ ఆప్షన్లు అర్థమయ్యేలా చెప్పి, సేల్స్ క్లోజ్ చేసేందుకు కంపెనీలకు భారీగా సేల్స్ ఎగ్జిక్యూటివ్ల అవసరం ఏర్పడింది.
రికార్డు స్థాయిలో నియామకాలు..
ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, క్వెస్ స్టాఫింగ్ సొల్యూషన్స్ వెల్లడించిన వివరాల ఆధారంగా.. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మధ్య స్మార్ట్ఫోన్ రిటైల్ రంగంలో నియామకాలు గత ఏడాదితో పోలిస్తే 36.3 శాతం పెరిగాయి. ఆగస్టు నెలలో రిక్రూట్మెంట్ సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరింది.
ముందస్తు ప్రణాళిక..
గతంలో పండుగలకు కొద్ది రోజుల ముందు హడావుడిగా నియామకాలు చేపట్టే కంపెనీలు, ఈసారి 12 నుంచి 14 వారాల ముందే రిక్రూట్మెంట్ ప్లానింగ్ పూర్తి చేసుకున్నాయి. ముఖ్యంగా రిటైల్ స్టోర్లు, ఫీల్డ్ సేల్స్ విభాగాల్లో 12-15 శాతం మేర తాత్కాలిక ఉద్యోగాల వృద్ధి కనిపిస్తోంది.
ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రంగాల్లోనూ జాబ్స్ జాతర..
ఆఫ్లైన్ స్టోర్లతో పాటు ఈ-కామర్స్, డెలివరీ, లాజిస్టిక్స్ సంస్థలు కూడా రికార్డు స్థాయిలో తాత్కాలిక ఉద్యోగులను తీసుకుంటున్నాయి. ఒక ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ తమ సెల్లార్ నెట్వర్క్, లాజిస్టిక్స్ సేవల కోసం ఏకంగా 10 లక్షలకు పైగా సీజనల్ ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకుంది.
సుదీర్ఘ పండుగ సీజన్
ఈసారి ఆగస్టు నుంచి నవంబర్ మధ్య వరకు సుదీర్ఘంగా ప్రమోషనల్ సేల్స్ సాగుతుండటంతో ఉద్యోగులను ముందుగానే విధుల్లోకి తీసుకుని తర్ఫీదు ఇస్తున్నారు. ముఖ్యంగా అమ్మకాల అవకాశాలు ఎక్కువగా ఉన్న టైర్-1, టైర్-2 నగరాల్లో కంపెనీలు మరింత ఎక్కువ మంది సిబ్బందిని గ్రౌండ్లోకి దించుతున్నాయి.
