Eesha rebba: టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. “అరవింద సమేత వీర రాఘవ” సినిమాలో తన పాత్ర విషయంలో త్రివిక్రమ్ తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది. ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్ రోల్లో నటించింది.
ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు తనకు కొన్ని సందేహాలు ఉన్నాయని ఈషా చెప్పింది. కమర్షియల్ సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తే భవిష్యత్తులో కూడా అలాంటి సైడ్ క్యారెక్టర్లే వస్తాయేమోనని భయపడిందని తెలిపింది. కానీ త్రివిక్రమ్ తన పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పడంతో ఒప్పుకున్నానని వెల్లడించింది. పెద్ద బ్యానర్, పెద్ద దర్శకుడు కావడంతో నో చెప్పలేకపోయానని కూడా తెలిపింది.
అయితే సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఈషా ఆవేదన వ్యక్తం చేసింది. తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో చాలా మంది “నీ పాత్ర ఏముంది సినిమాలో?” అని ఫోన్ చేశారని చెప్పింది. మంచి పాత్ర అని చెప్పి, చివరకు ప్రాధాన్యత లేని పాత్ర ఇచ్చారని త్రివిక్రమ్ తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది.
మంచి సినిమాలో అవకాశం వచ్చినందుకు సంతోషించాలో, లేక తక్కువ ప్రాముఖ్యత ఉన్న పాత్ర చేసినందుకు బాధపడాలో అర్థం కాలేదని ఈషా చెప్పింది. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
