Eatala Rajendar: బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్పై కేసు నమోదైంది. ఉపేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 126 (2), 115 (2), 352, 351 (2), R/W 189 (2), R/W 191 (2) యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఓ భూమి వద్ద సెక్యూరిటీగా ఉన్న తనపై ఈటల రాజేందర్ సహా 30 మంది తనపై దాడి చేశారంటూ ఉపేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి.
Eatala Rajendar: పోచారం మున్సిపల్ పరిధిలోని ఏకశిలానగర్లో ప్లాట్లను కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ బాధితులు ఎంపీ ఈటల రాజేందర్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ మేరకు ఈటల బీజేపీ కార్యకర్తలతో కలిసి స్థలాలను పరిశీలించారు. అదే సమయంలో ఆక్రమణదారుడికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్కడే మద్యం సేవిస్తూ కనిపించారు. అందులో ఒకరిపై ఈటల చేయి చేసుకున్నారు. మిగతా వారందరినీ బీజేపీ కార్యకర్తలు చితకబాదారు. నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. ఉపేందర్, రఫీక్ అనే వ్యక్తులపై కార్యకర్తలు దాడి చేసి కొట్టారు. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని దారికి తెచ్చారు.