Viral Marriage

Viral Marriage: ఐసీయూలో పెళ్లి.. బెడ్డే మండపం.. తాళికట్టు శుభవేళ పెళ్లికూతురు..

Viral Marriage: శుభముహూర్తంలో తాళి కట్టాల్సిన చేతులు.. ఎమర్జెన్సీ వార్డులో వధువు మెడలో మూడు ముళ్లు వేశాయి. కారు ప్రమాదంతో కల్యాణ మండపానికి బదులు ఆస్పత్రి బెడ్ మీద పెళ్లి చేసుకున్న ఒక జంట కథ ఇది.

ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది ఓ మధుర ఘట్టం. కొత్త జీవితానికి నాంది పలికే ఈ వేడుకను అంగరంగ వైభవంగా, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకోవాలని అందరూ కలలు కంటారు. సరిగ్గా అలాంటి కలలతోనే కేరళకు చెందిన ఒక యువ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైంది. కానీ, విధి ఆడిన వింత నాటకంలో పెళ్లి ముహూర్తానికి కొద్ది గంటల ముందు ఊహించని పరిణామం ఎదురైంది.

కారు ప్రమాదం: ఆస్పత్రి పాలైన పెళ్లి కూతురు

కేరళలోని అలప్పుజ ప్రాంతానికి చెందిన అవని, తంబోలికి చెందిన వి.ఎం. షారన్ల వివాహం శుక్రవారం మధ్యాహ్నం 12:15 నుండి 12:30 గంటల మధ్య జరగాల్సి ఉంది. ఉదయాన్నే పెళ్లికూతురు అవని పెళ్లి అలంకరణ కోసం కుమరకోమ్‌కు కారులో బయలుదేరింది. అయితే, దురదృష్టవశాత్తూ ఆ కారు ప్రమాదానికి గురైంది.

ఈ ఘటనలో అవనికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా, ఆమె వెన్నెముకకు బలంగా దెబ్బ తగలడంతో పరిస్థితి విషమంగా మారింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కొట్టాయం వైద్య కళాశాలకు, ఆ తర్వాత ప్రత్యేక వైద్యం కోసం ఎర్నాకుళంలోని వీపీఎస్ లేక్‌షోర్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి (ఎమర్జెన్సీ/ఐసీయూ) తరలించారు. పెళ్లి వేళ ఇలాంటి వార్త విన్న రెండు కుటుంబాలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయాయి.

ఎమర్జెన్సీ వార్డులోనే పెళ్లి పీటలు

ప్రమాద వార్త తెలుసుకున్న వరుడు షారన్ కుటుంబ సభ్యులతో కలిసి హుటాహుటీన ఆసుపత్రికి చేరుకున్నాడు. అవని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తర్వాత ఇరు కుటుంబాల సభ్యులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముహూర్తం దాటకూడదని, ఆస్పత్రిలోనే పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు.

ఇది కూడా చదవండి: KTR: ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ ఫైనల్‌ రిపోర్ట్‌..

వైద్యులను సంప్రదించగా, వారు మొదట్లో సంశయించినా, వధూవరుల నిర్ణయం, రెండు కుటుంబాల ఆవేదన చూసి సున్నితంగా స్పందించారు. వధువు అవనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అత్యవసర విభాగంలోనే పెళ్లి నిర్వహణకు అనుమతించారు.

బెడ్ పైనే వధువు… తాళి కట్టిన వరుడు:

మధ్యాహ్నం 12:15 గంటలకు ఆ దృశ్యం కంటతడి పెట్టించింది. ఎమర్జెన్సీ వార్డులోని బెడ్ పై వెన్నెముక గాయంతో చికిత్స పొందుతున్న అవని మెడలో వరుడు షారన్ ప్రేమతో మూడు ముళ్లు వేశాడు. నుదుటిపై బొట్టు పెట్టి, ఆమెను తన జీవిత భాగస్వామిగా స్వీకరించాడు. ఆసుపత్రి సిబ్బంది, అతి కొద్ది మంది బంధువులు మాత్రమే ఈ అసాధారణమైన వేడుకకు సాక్షులుగా నిలిచారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, సిబ్బంది కూడా ఈ దృశ్యాన్ని చూసి కొంత ఆశ్చర్యానికి లోనైనా, నూతన దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

ప్రస్తుతం అవనికి వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్స జరగాల్సి ఉందని వైద్యులు తెలిపారు. విషాద సమయంలోనూ, ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకుని, మాట తప్పకుండా తమ ప్రేమను నిలబెట్టుకున్న ఈ జంట కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అందరి హృదయాలను కదిలిస్తోంది. షారన్ తీసుకున్న ఈ నిర్ణయం నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *