Road Accident: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ఆటోను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
-
బాధితుల వివరాలు: బాధితులంతా పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారు. వీరంతా బాపట్ల జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టినరోజు వేడుకకు హాజరై తెల్లవారుజామున ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
-
మృతులు: ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, చికిత్స పొందుతూ గుంటూరు జీజీహెచ్లో ఇద్దరు, చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మరొకరు మరణించారు. మృతులను బొంతా బాబు, బొంతా మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మమ్మ, గంగమ్మ, మరియమ్మ, చౌటుపల్లి సువార్తగా గుర్తించారు.
-
క్షతగాత్రులకు చికిత్స: గాయపడిన మరో 8 మందికి గుంటూరు జీజీహెచ్, స్థానిక ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి..
-
సీఎం చంద్రబాబు ఆదేశాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
-
పవన్ కళ్యాణ్ ఆదేశాలు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కఠిన తనిఖీలు చేపట్టాలని రవాణా, పోలీస్ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, మితిమీరిన వేగం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
