Arjun Reddy RE-Release: టాలీవుడ్లో ఒకప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ పెద్ద సంచలనం సృష్టించింది. పోకిరి, జల్సా, ఖుషి వంటి క్లాసిక్స్ థియేటర్లలోకి వచ్చినప్పుడు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. డబ్బులు వస్తున్నాయి అని ప్రతి పాత సినిమాను థియేటర్లలోకి తీసుకురావడంతో ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి తగ్గిపోయింది. అదే సినిమా, అవే పాత సీన్లు మళ్లీ చూడటానికి ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పబ్లిసిటీ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలోనే, రీ రిలీజ్ మార్కెట్కు సరికొత్త రూపు ఇవ్వడానికి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సరికొత్త ఆలోచనతో ముందుకొస్తున్నారు.
-
కత్తెర పడిన సీన్లు మళ్లీ తెరపైకి: ఇది సాధారణ రీ-రిలీజ్ కాకుండా, అప్పట్లో సెన్సార్ లేదా నిడివి సమస్యల వల్ల ఎడిటింగ్లో తొలగించిన కీలక సన్నివేశాలను మళ్లీ జోడించి ‘డైరెక్టర్స్ ఎక్స్టెండెడ్ వెర్షన్’గా తీర్చిదిద్దనున్నారు.
-
డబ్బింగ్ & ఎడిటింగ్ పనులు: ఈ కొత్త వెర్షన్ కోసం విజయ్ దేవరకొండ 2-3 రోజులు డబ్బింగ్ చెబితే సరిపోతుందని, తనకు మాత్రం మరో 15 నుంచి 20 రోజుల ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పని ఉంటుందని వంగా ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో సరైన సమయం కోసం చూస్తున్నారు.
రీ రిలీజ్ మార్కెట్కు కొత్త ఊపిరి.. దర్శకులకు సరికొత్త దారి..
పాత సినిమానే మళ్లీ 4Kలో చూడటం కంటే, ఇంతకు ముందెన్నడూ చూడని కొత్త సీన్లతో కూడిన కొత్త వెర్షన్ వస్తే ఆడియన్స్ మళ్లీ థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే, టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్లుగా నిలిచిన ఇతర చిత్రాల దర్శకులు కూడా తమ వద్ద ఉన్న తొలగించిన సన్నివేశాలతో ‘డైరెక్టర్స్ కట్’లను విడుదల చేసే సరికొత్త ట్రెండ్కు తెరలేస్తుంది. నాడు రొటీన్ ప్రేమకథల మూసను బద్దలుకొట్టిన ‘అర్జున్ రెడ్డి’.. ఇప్పుడు పదేళ్ల తర్వాత అదే రీ రిలీజ్ మార్కెట్లోనూ సరికొత్త ట్రెండ్ను సెట్ చేస్తుందేమో చూడాలి.
