Chevella: చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో చట్టవిరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. మంగ్లీ పుట్టినరోజు వేడుకల పేరుతో రిసార్ట్లో అనుమతుల్లేకుండా ఈవెంట్ నిర్వహించడమే కాకుండా మద్యం, గంజాయి వంటివి వినియోగించారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మంగ్లీతో పాటు నలుగురిపై కేసులు నమోదు చేశారు.
పోలీసులు హెచ్చరిక
అసాంఘిక కార్యకలాపాలు జరిగే స్థలాలపై కఠినంగా వ్యవహరించనున్నట్లు చేవెళ్ల పోలీసులు స్పష్టం చేశారు.
‘‘ఎంతటి ప్రముఖులైనా సరే, చట్టాల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల వాడకంపై ఎటువంటి సడలింపూ ఉండదు’’ అని పోలీసులు సోషల్ మీడియాలో హెచ్చరించారు.
ఈ ఘటనలో నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారు:
గాయని మంగ్లీ
రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ
ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్
పార్టీ పాల్గొనగా దామోదర్ రెడ్డి
ఈవెంట్కు అనుమతి లేకుండా నిర్వహించడంపై, అలాగే పర్మిషన్ లేకుండా మద్యం వినియోగంపై కేసులు నమోదయ్యాయి.
గంజాయి టెస్ట్ పాజిటివ్ – ఎన్డీపీఎస్ కేసు
దామోదర్ రెడ్డికి గంజాయి టెస్టులో పాజిటివ్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ చర్యతో రిసార్ట్లో జరిగిన పార్టీపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
48 మంది హాజరు – సెలబ్రిటీల పేర్లు తెరపైకి
ఈ పార్టీకి మొత్తం 48 మంది హాజరైనట్టు గుర్తించారు. వారిలో బిగ్ బాస్ ఫేమ్ దివి, ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
క్లబ్బులుగా మారుతున్న రిసార్టులు
హైదరాబాద్ శివారులోని రిసార్టులు నైట్ పార్టీల అడ్డాగా మారిపోతున్నాయన్న ఆరోపణలు పునఃప్రారంభమయ్యాయి. అశ్లీల నృత్యాలు, విదేశీ మద్యం సరఫరా, డ్రగ్స్ వినియోగం వంటి అంశాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. త్రిపుర రిసార్ట్ ఘటన తర్వాత రిసార్టులపై దర్యప్తు మరింత కఠినంగా సాగనుంది.