Chamala Kiran Kumar Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునేందుకు బీజేపీ బస్తీ నిద్రకు పిలుపునిచ్చిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మూసీ ప్రజల వాస్తవ పరిస్థితులను కమలనాథులు తెలుసుకోవాలంటూ కామెంట్ చేశారు. అక్కడి ప్రజలతో కలిసి నిద్రించి, వారితో భోజనం చేసి యోగక్షేమాలు తెలుసుకుని వస్తే తప్పు లేదని.. కానీ ప్రభుత్వం కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవద్దని హితువు పలికారు. సబర్మతి, గంగా రివర్ ఫ్రంట్ మాదిరిగానే మూసీ పునరుజ్జీవానికి బీజేపీ నేతలు సహరించాలని అన్నారు.
దక్షిణ భారతదేశాన్ని కూడా గుజరాత్ మోడల్ లాగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాగా,మూసీ పరీవాహక బస్తీల్లో ఒకరోజు నిద్రించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలును కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్వీకరించారు. ఈ మేరకు ఇవాళ సాయత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని సుమారు 20 బస్తీల్లో బీజేపీ ముఖ్య నేతలు బస్తీవాసులతో మమేకమై అక్కడే నిద్రించనున్నారు. అదేవిధంగా అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని తులసీరామ్ నగర్ లో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి నిద్రించనున్నారు.