Cherlapally: సికింద్రాబాద్ నుండి చర్లపల్లి రైల్వే టెర్మినల్ వరకు ప్రతి 10 నిమిషాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ చెంగిచెర్ల డిపో మేనేజర్ కే కవిత తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ, నూతనంగా ప్రారంభమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్కు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రతి రోజు 10 నిమిషాలకు ఒక్క బస్సు నడిపించబడుతుందని చెప్పారు.
రూట్ నెంబర్ 250సీ ద్వారా సికింద్రాబాద్ బ్లూసీ పాయింట్ నుంచి ఉదయం 4.30 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, హెచ్పీసీఎల్ మీదుగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ (ప్లాట్ ఫాం నెంబర్ 1)కు బస్సు అందుబాటులో ఉంటుంది. అక్కడి నుండి తిరిగి సికింద్రాబాద్ వరకు కూడా బస్సు సౌకర్యం ఉంటుందని ఆమె చెప్పారు.
అలాగే, చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి చెంగిచెర్ల, ఉప్పల్, రామంతాపూర్ మీదుగా బోరబండ వరకు కూడా ప్రతి రోజు 40 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుందని కవిత తెలిపారు.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా అదనంగా నడిచే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఉప్పల్ నుండి ప్లాట్ ఫాం నెంబర్ 9 చర్లపల్లి రైల్వే టెర్మినల్ వరకు అదనంగా బస్సులు నడుపుతామని ఆమె పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆమె సూచించారు.