Kidnap Case

Kidnap Case: కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

Kidnap Case: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ఆక్వా వ్యాపారి కిడ్నాప్​ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కుట్రకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ నెల 16న ఆక్వా వ్యాపారి విశ్వనాథుని వెంకట సత్యనారాయణను కొందరు కారులో కిడ్నాప్​ చేశారని డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య వెల్లడించారు. సత్యనారాయణ కుమారుడి ఫిర్యాదు మేరకు అప్రమత్తమై రంగంలోకి దిగినట్లు తెలిపారు. టోల్​గేట్ల వద్ద సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించి బాధితుడిని అనంతపురం వైపు తీసుకెళ్లినట్లు గుర్తించామన్నారు.

అనంతపురం పోలీసుల సాయంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. వారిని భీమవరం తీసుకువచ్చి విచారణ జరిపినట్లు తెలిపారు. ఇచ్చిన అప్పు వసూలు చేసుకునేందుకే వడ్డీ వ్యాపారులు కిరాయి ముఠాతో ఈ కిడ్నాప్​ చేసినట్లు స్పష్టం చేశారు. భీమవరానికి చెందిన సోమిశెట్టి ఆర్​కే సత్యప్రసాద్​, ఇన్నమూరి లక్ష్మీ వెంకట మల్లికార్జున సురేష్​బాబు నుంచి విశ్వనాథుని సత్యనారాయణ గతంలో తక్కువ వడ్డీకి అప్పు తీసుకున్నాడు. ఆ తరువాత అసలు, వడ్డీ చెల్లించలేదు.

2021లో లెక్కలు చూసుకోగా రూ.10.70 కోట్ల మేర బకాయి పడినట్లు తేలింది. అప్పటినుంచి డబ్బు చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా సత్యనారాయణ స్పందించలేదు. దీంతో ఆయనను బెదిరించి అప్పు వసూలు చేసుకోవాలని భావించారు. దీనిపై సత్యసాయి జిల్లా ముదిగుబ్బ వద్ద ఉన్న రెస్టారెంట్​ యజమాని ఆశిష్​తో చర్చించారు. రూ.10 కోట్లు వసూలు చేస్తే 10 శాతం కమీషన్​ ఇస్తామని చెప్పారు. దీంతో అశిష్​ అతని స్నేహితుడు లోకేశ్​ ద్వారా కిడ్నాప్​నకు ప్లాన్​ చేశాడు.

కిడ్నాప్​ ప్లాన్​ కీలక పాత్ర పోషించిన వడ్డీ వ్యాపారి ఇన్నమూరి లక్ష్మీవెంకట మల్లికార్జున సురేష్‌బాబు, ముఠా సభ్యులైన ఉమ్మడి అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముంటిమడుగు వాసి అరవ భగవాన్‌, గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామస్థుడు బాల నాగేంద్రబాబు, తొండపాడు వాసి మునగాల హరికృష్ణ, నల్లమాడ మండలం రాగానిపల్లి తండాకు చెందిన బుక్కే దివాకర్‌నాయక్, రుద్దం మండలం చోలేమర్రి వాసి బోయే రాము, కడప నగరానికి చెందిన మేఘవత్‌ చరణ్‌లను పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి 3 కార్లు, 9 సెల్​ఫోన్లు, వాకీటాకీ, చాకు, క్రికెట్‌ వికెట్లు, హాకీ స్టిక్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో వడ్డీ వ్యాపారి సోమిశెట్టి ఆర్‌కే సత్యప్రసాద్‌తో పాటు ఆశిష్, లోకేశ్, రాజేష్, గోవర్థన్‌లు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chandrababu Naidu: రాయలసీమ బిడ్డను నేను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *