K.S. Viswanathan

K.S. Viswanathan: ఏ.పి. ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ తొలి డైరెక్టర్ల సమావేశం

పత్రికా ప్రకటన
విజయవాడ, తేదీ: 15.06.2026

• ఏ.పి. ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ తొలి డైరెక్టర్ల సమావేశం
• చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కార్యాచరణ దిశగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తొలి బోర్డు సమావేశం

– ఏ.పి. ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్

రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం తొలి బోర్డు సమావేశం సోమవారం విజయవాడ ఫార్చూన్ మురళి పార్క్ హోటల్‌లో విజయవంతంగా నిర్వహించామని మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్ తెలిపారు. సమావేశానికి కార్పొరేషన్ ఛైర్మన్ పి. భరత్ భూషణ్ అధ్యక్షత వహించగా, మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్, డైరెక్టర్లు వై. ఝాన్సీ, సుమన్ తల్వార్, ఎస్. శివాజీ, చదలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయి మాధవ్, కందిమళ్ల సాంభశివరావు, వివేక్ కూచిభొట్ల, వి. సముద్ర, కే. ఉమామహేశ్వరరావు, ఎస్. వెంకట కృష్ణా రెడ్డి, జి. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణ, దుర్గా ప్రసాద్ సాహు లు హాజరయ్యారు.

సమావేశంలో రాష్ట్రంలో చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగాల సమగ్రాభివృద్ధికి అవసరమైన చర్యలపై విస్తృతంగా చర్చించారు. బోర్డు డైరెక్టర్ల సభ్యుల్లో ఒకరు చిక్కాల మెహర్ రమేష్ కుమార్ ను ఉపాధ్యక్షులుగా ఎంపిక చేసే ప్ర్రక్రియను పూర్తి చేశామన్నారు. బోర్డు సమావేశానంతరం ఈజీఎమ్ (Extraordinary General meeting) మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, ప్రోత్సాహకాలు, పెట్టుబడుల ఆకర్షణ, చిత్రీకరణకు అనుకూల వాతావరణం కల్పించడం తదితర అంశాలపై సమగ్ర కార్యాచరణ (రూట్ మ్యాప్) రూపొందించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గతంలో ప్రకటించిన నంది అవార్డులు, భవిష్యత్తులో నిర్వహించాల్సిన నంది అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన వివిధ అంశాలు, విధివిధానాలు, సూచనలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించామన్నారు.

రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమను మరింత బలోపేతం చేయడంతో పాటు కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు ప్రోత్సాహం అందించేలా కార్పొరేషన్ కార్యాచరణ కొనసాగుతుందని సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారని మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ తెలియజేశారు.

సమావేశంలో ఏ.పి. ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ జనరల్ మేనేజర్ ముడావత్ శ్రీనివాస్ నాయక్, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

జారీ చేసినవారు: సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్

K.S. Viswanathan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *