Fire Accident: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు స్టేజీ వద్ద శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక అభయ హనుమాన్ విగ్రహం నుంచి కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి వరకు ఉన్న దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని, అందులోని సామగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. ప్రధానంగా సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని వ్యాపారులు భారీ మొత్తంలో బొమ్మలు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఒక్కో దుకాణంలో దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విలువైన బొమ్మలు ఉన్నాయని, ఈ ప్రమాదంలో కోట్ల రూపాయలలో ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ దుర్ఘటనతో వ్యాపారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికే దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. మల్యాల, ధర్మపురి సీఐలు రవి, రాంనర్సింహారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించగా, ప్రమాదానికి విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
