Sri Sathya Sai Baba Shata Jayanti: శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (నవంబర్ 19) పుట్టపర్తిలో పర్యటించి, వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి నేరుగా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న ప్రధాని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు.
ప్రధాని ముందుగా సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. అనంతరం, హిల్వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ముఖ్య వేదికపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా జీవితం, బోధనలు, ఆయన చేసిన అపారమైన సేవలను స్మరించుకుంటూ, ప్రధాని మోదీ రూ. 100 ప్రత్యేక స్మారక నాణెం మరియు నాలుగు తపాలా బిళ్లలను ఆవిష్కరించారు.
ఈ వేదికపై జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ప్రధాని, సత్యసాయి సేవలు మానవాళికి, ముఖ్యంగా మహిళా సాధికారతకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని కొనియాడారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో, హిల్వ్యూ ఆడిటోరియం సహా పుట్టపర్తి ప్రాంతమంతా ఎస్పీజీ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందే, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ నటి ఐశ్వర్యారాయ్ సైతం మహా సమాధిని దర్శించుకోవడం పుట్టపర్తి ఉత్సవాలకు మరింత శోభను తెచ్చింది.
పుట్టపర్తి పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ, మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ ఆయన దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ సదస్సులో పాల్గొననున్నారు.
