Cricket: అండర్-19 జట్టులోకి హైదరాబాద్ యువ పేసర్ మహమ్మద్ మాలిక్

Cricket: హైదరాబాద్‌ యువ క్రికెటర్‌ మహమ్మద్‌ మాలిక్‌కు అరుదైన గౌరవం దక్కింది. టీమిండియా అండర్‌-19 ‘ఏ’ జట్టులో చోటు సంపాదించి తన ప్రతిభను మరొకసారి నిరూపించాడు. ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన మాలిక్‌, టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు.

నాంపల్లి మల్లెపల్లి ప్రాంతానికి చెందిన ఈ యువ పేసర్‌ తన పదునైన బౌలింగ్‌, కీలక సమయాల్లో వికెట్లు సాధించే నైపుణ్యంతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శన ఆధారంగా బీసీసీఐ అతడిని అండర్‌-19 ‘ఏ’ జట్టుకు ఎంపిక చేసింది.

ఈనెల 17 నుంచి బెంగళూరులో జరగనున్న ట్రై సిరీస్‌లో ఇండియా అండర్‌-19 ‘ఏ’, ఇండియా అండర్‌-19 ‘బి’, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌లో మాలిక్‌ భారత తరఫున బరిలోకి దిగనున్నాడు.

జాతీయ జట్టుకు ఎంపిక కావడంపై మాలిక్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. “ఇది నా జీవితంలో అత్యంత గర్వకారణమైన క్షణం. టీమిండియాలో స్థానం సంపాదించడం నా తొలి అడుగు మాత్రమే. భవిష్యత్తులో సీనియర్‌ జట్టులో ప్రాతినిధ్యం వహించడం నా లక్ష్యం,” అని మాలిక్‌ తెలిపారు.

మాలిక్‌ ఎంపికతో హైదరాబాద్‌ క్రికెట్‌ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. స్థానిక కోచ్‌లు, స్నేహితులు, అభిమానులు అతడిని అభినందిస్తున్నారు. నగరం నుంచి మరో ప్రతిభావంతుడు జాతీయ స్థాయిలో మెరవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.:

మహమ్మద్ మాలిక్‌, హైదరాబాద్‌, అండర్‌-19 క్రికెట్‌, వినూ మన్కడ్ ట్రోఫీ, భారత జూనియర్ జట్టు, బీసీసీఐ, ఆఫ్ఘనిస్థాన్ సిరీస్, యువ బౌలర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *