Wine Shops Close: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల (Jubilee Hills Bypolls) నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు వీలుగా నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు రోజున కూడా ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
నవంబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఓట్ల లెక్కింపు రోజు అయిన నవంబర్ 14న ఉదయం 6 గంటల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు, అవసరమైతే రిపోలింగ్ రోజు కూడా వైన్ షాపులు, బార్లను మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతీ ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Crime News: ఏపీలో విషాదం.. 5వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి.. తల్లి సంచలన ఆరోపణలు!
ఎక్కడెక్కడ ఆంక్షలు
కమిషనర్ అవినాష్ మోహంతీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతాల్లో ఈ ఆంక్షలు వర్తిస్తాయి.అన్ని వైన్ షాపులు, కల్లు (తాటి) దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, స్టార్ హోటల్స్లోని బార్లు, మరియు రిజిస్టర్డ్ క్లబ్లలోని బార్లు మూసివేయబడతాయి.
ఈ ఆదేశాలు తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 మరియు ప్రజాప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 135-C ప్రకారం జారీ చేయబడ్డాయి. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు మరియు అక్రమ మద్యం సరఫరాను అరికట్టేందుకు ఈ ఆంక్షలు విధించినట్లు కమిషనర్ తెలిపారు.

