Cm chandrababu : ఆంధ్రప్రదేశ్ను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలోనే లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
విశాఖపట్నంలో జరిగిన ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సదస్సులో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న పాలసీలు గురించి వివరించారు. ప్రస్తుతం దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 9 శాతం వాటాతో 50 బిలియన్ డాలర్ల విలువను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందని తెలిపారు. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 35 శాతంగా ఉందని, ఇవే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ‘ఫ్రూట్ కేపిటల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన ఏపీ, ఇప్పుడు దేశానికి ‘ఆక్వా హబ్’ గానూ నిలుస్తోందని చెప్పారు.
పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0’ను అమలు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. రూ.200 కోట్లకు పైబడిన పెట్టుబడులను మెగా ప్రాజెక్టులుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు, 17 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం ఉందని వివరించారు.
కేవలం పెట్టుబడులకే కాకుండా, ఆవిష్కరణలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం అన్నారు. అగ్రిటెక్ రంగంలో బిల్ గేట్స్ ఫౌండేషన్, ఆవిష్కరణల కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. ‘వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్’ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం పెట్టుబడులకు ఇది సరైన సమయం అని, కేంద్రం–రాష్ట్రం పూర్తి స్థాయి సహకారం అందిస్తాయని భరోసా ఇచ్చారు.
ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్న నేపథ్యంలో, ప్రపంచ స్థాయి బ్రాండ్లను భారత్ నుంచే తయారు చేయడం తమ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా, సుస్థిరంగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు. త్వరలో అమరావతిలో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ – ఏపీ చాప్టర్ ప్రారంభం కానుండటం సంతోషకరమని తెలిపారు.