Hyderabad: దేశంలోని రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఆయన, “దేశంలోని దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలో టెలికాం సంస్థలు 4జీ/5జీ సేవలను అందిస్తున్నాయి. అదనంగా, ప్రయాణికుల సౌకర్యార్థం రైల్టెల్ ఆధ్వర్యంలో ‘రైల్వైర్’ పేరుతో 6,115 స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించాం” అని తెలిపారు.
ఈ సేవలు అందుబాటులో ఉన్న స్టేషన్లలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడతో పాటు న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, హౌరా, బెంగళూరు (యశ్వంత్పుర్), అహ్మదాబాద్, భోపాల్, పుణె, భువనేశ్వర్, అమృత్సర్, ఎర్నాకుళం, ప్రయాగ్రాజ్ వంటి అనేక ప్రధాన స్టేషన్లు ఉన్నాయి.
ప్రయాణికులు తమ స్మార్ట్ఫోన్లలో వైఫై ఆప్షన్ ద్వారా ‘రైల్వైర్’ నెట్వర్క్ను ఎంచుకుని, మొబైల్ నంబర్ నమోదు చేసి, OTP ఎంటర్ చేస్తే వెంటనే ఉచిత ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు. స్టేషన్ ప్రాంగణంలో ఉన్నంతకాలం ప్రయాణికులు ఈ సేవల ద్వారా ఆన్లైన్ పనులు చేసుకోవచ్చు, వీడియోలు చూడవచ్చు.