Anakapalle: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం అరిపాలెం గ్రామం వద్ద ఈరోజు ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. మద్యం తరలిస్తున్న ఒక వాహనం బోల్తా పడటంతో, రోడ్డుపై పడిపోయిన మద్యం సీసాలను ఏరుకోవడానికి ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడారు. దీనివల్ల జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సమాచారం ప్రకారం, అరిపాలెం గ్రామం సమీపంలో వేగంగా వెళ్తున్న మద్యం లోడుతో కూడిన వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న వేలాది మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గమనించిన స్థానికులు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. దొరికిన సీసాలను దొరికినట్లుగా ఏరుకోవడం మొదలుపెట్టారు.
Also Read: Anantapur: ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య – అనంతపురంలో ఘోరం
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది:
మద్యం సీసాలను సేకరించేందుకు ప్రజలు రోడ్డుపైనే గుమిగూడటంతో, హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. మద్యం ఏరుకుంటున్న వారిని చెదరగొట్టి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనతో హైవేపై కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మద్యం తరలిస్తున్న వాహనం బోల్తా
రోడ్డుపై మద్యం సీసాలు ఏరుకోడానికి ఎగబడ్డ జనం.. భారీగా ట్రాఫిక్ జామ్
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం అరిపాలెం గ్రామంలో ఘటన pic.twitter.com/jCUPo3AHXo
— Telugu Scribe (@TeluguScribe) June 24, 2025
