Anantapur: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే హత్య చేయించిన దారుణ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. అక్కంపల్లి-రాచానపల్లి రహదారిపై జరిగిన ఈ హత్య కేసును అనంతపురం పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్టు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. అక్కంపల్లిలో చిన్న హోటల్ నడుపుతున్న 43 ఏళ్ల సురేష్ బాబును హత్య చేశారు. ఈ హత్య వెనుక అతని భార్య అనిత (37) హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. అనితకు 34 ఏళ్ల ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో రెండు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఫక్రుద్దీన్ ఊరూరూ తిరుగుతూ పండ్లు విక్రయించేవాడు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది.
ఈ విషయంపై భర్త సురేష్ బాబుకు అనుమానం వచ్చి, మద్యం సేవించి వచ్చి అనితను వేధించేవాడు. సురేష్ బాబు వేధింపుల గురించి అనిత తన ప్రియుడు ఫక్రుద్దీన్కు చెప్పింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేస్తే ఇద్దరం సంతోషంగా ఉండవచ్చని అనిత, ఫక్రుద్దీన్ను ప్రోత్సహించింది.
ప్రతిరోజు రాత్రి సురేష్ బాబు హోటల్ మూసేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తాడని అనిత తన ప్రియుడికి చెప్పింది. అదే సమయంలో దాడి చేసి చంపాలని పథకం వేశారు. ఈ పథకానికి ఫక్రుద్దీన్ అంగీకరించాడు. హత్య జరిగిన రోజు రాత్రి అనిత ఫక్రుద్దీన్కు ఫోన్ చేసి “ఈరోజే ఎలాగైనా చంపాలి” అని చెప్పింది.
Also Read: Pakistan: భారత్తో చర్చించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉంది
రాత్రి 11 గంటల సమయంలో సురేష్ బాబు హోటల్ మూసేసి బైక్పై సదాశివ కాలనీకి బయల్దేరాడు. మార్గమధ్యలో బాబా ఫక్రుద్దీన్ అతనిపై దాడి చేశాడు. సమీపంలో ఉన్న సీసాను సురేష్ బాబుపై విసరడంతో అతను ద్విచక్ర వాహనంతో సహా కింద పడిపోయాడు. అనంతరం ఫక్రుద్దీన్ తన వెంట తెచ్చుకున్న స్క్రూడ్రైవర్తో సురేష్ బాబును పొడిచి, ఆ తర్వాత బండరాయితో బాది హత్య చేశాడు. హత్య అనంతరం ఫక్రుద్దీన్ అక్కడి నుంచి పారిపోయాడు.
పోలీసుల వేగవంతమైన దర్యాప్తు:
అక్కంపల్లి సమీపంలో హత్య జరిగిందని తెలియగానే జిల్లా ఎస్పీ పి. జగదీష్ వెంటనే రంగంలోకి దిగారు. ఈ కేసును తక్షణమే ఛేదించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు పర్యవేక్షణలో సీఐ శేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలించి, పక్కా సమాచారంతో కేవలం ఆరు గంటల్లోనే అనిత, ఫక్రుద్దీన్లను అరెస్టు చేశారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.