ACB Raids: తెలంగాణలో లంచావతారులు రోజుకు కొందరు వెలుగు చూస్తున్నారు. ఏదో ఓ మూలన ఏసీబీ వలలో చిక్కుకుంటున్నారు. పలువురు తోటి ఉద్యోగులు ఏసీబీ కేసుల్లో ఇరుక్కొని ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకుంటున్నా, లంచాలు తీసుకోవడం మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు మానడం లేదు. ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. ఆ రక్తదాహానికి తట్టుకోలేని ఎందరో అమాయక ప్రజలు ఏసీబీని ఆశ్రయిస్తూ లంచావతారులను పట్టిస్తున్నారు.
ACB Raids: ఇలా ఒక్కరోజే ముగ్గురు లంచావతారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ములుగు జిల్లాలో ఇద్దరు ఉండగా, సంగారెడ్డి జిల్లాలో మరొకరు ఏసీబీకి చిక్కిపోయారు. ఓ చోట రూ.20 వేలు లంచం డిమాండ్ చేయగా, మరోచోట రూ.12 వేలు డిమాండ్ చేశారు. ఇలా లంచాలకు కక్కుర్తిపడిన ఆ అధికారులు ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు.
ACB Raids: ములుగు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడికి పోస్టింగ్ ఆర్డర్ కోసం ఆ జిల్లా డీఈవో జీ పాణిని, జూనియర్ అసిస్టెంట్ టీ దిలీప్కుమర్లను కలిశారు. వారు ఆ ఉపాధ్యాయుడి నుంచి రూ.20 వేలు లంచంగా డిమాండ్ చేశారు. తాము అడిగినంత లంచం ఇవ్వకపోతే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వబోమంటూ వారిద్దరూ బెదిరించారు. దీంతో ఆవేదనకు లోనైనా ఆ ఉపాధ్యాయుడు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచన మేరకు డీఈవో జీ పాణిని, జూనియర్ అసిస్టెంట్ టీ దిలీప్కుమర్ను ఆ ఉపాధ్యాయుడు రెడ్హ్యాండెడ్గా పట్టించారు.
ACB Raids: ఇది ఇంకో విషయం.. సంగారెడ్డి జిల్లా కొహీర్ మండలానికి చెందిన ఒక వ్యక్తి వాటర్ సర్వీసింగ్ సెంటర్ నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ అనుమతి కోరాడు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ అనుమతి ఇచ్చేందుకు కార్యదర్శి నాగలక్ష్మి ఏకంగా రూ.12 వేలు డిమాండ్ చేసింది.
ACB Raids: జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకునే సెంటర్ కోసం అంత ఇవ్వాలా? అనుకున్న అతను వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు బాధితుడు లంచం ఇచ్చేందుకు ఒప్పుకొని ఆమెకు ఇవ్వబోతుండగా, ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరు ముగ్గురే కాదు.. రాష్ట్రంలో సచివాలయం నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకూ ఎందరో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచాల మత్తులో తూగుతున్నారు. ఆ మత్తు దిగేందుకు ఏసీబీ తన నిరంతర ప్రయత్నాన్ని కొనసాగించాలని ప్రజాతంత్ర వాదులు కోరుతున్నారు.
