Seetakka: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క చేసిన ప్రకటన ఈ దిశగా కీలక సంకేతాలివ్వగా, జూలైలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘‘జూలై నెలలో గ్రామ పంచాయతీ (సర్పంచ్) ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల అవుతుంది’’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిస్తూ – ‘‘ప్రతి గ్రామ పంచాయతీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని, పాతనేతలూ, కొత్త నేతలూ కలిసి సమన్వయంతో పనిచేయాలి. భేదాభిప్రాయాలకు ఆస్కారం లేకుండా చక్కటి విజయాన్ని సాధించాలి’’ అని పేర్కొన్నారు.
ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారించినట్టు సమాచారం. ఆయన్ను కలిసిన జిల్లాల నాయకులతో సమావేశాల్లోనూ జూలైలో ఎన్నికలు జరుగుతాయని, అందుకు సిద్ధంగా ఉండాలని సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
