Ambati Rambabu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరులో జరిగిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం సందర్భంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
బుధవారం ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటైన సభలో అంబటి రాంబాబు పాల్గొనగా, అక్కడే పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికారులు విధులు నిర్వహిస్తున్నపుడు అంబటి, ఆయన అనుచరులు జోక్యం చేసుకుని పోలీసులను బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఆయనతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Palakurthi Jhansi Reddy: ముదిరి పాకాన పడ్డ పాలకుర్తి రాజకీయం!
పోలీసుల ప్రకారం, విధుల్లో ఆటంకం కలిగించడం, అధికారులను బెదిరించడం, ప్రభుత్వ కార్యకలాపాల్లో మౌలిక నిబంధనలు ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై పీఏక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసు సంబంధించి విచారణ ప్రారంభమైంది.
ఇకపోతే, ఈ కేసు రాజకీయంగా సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ వేడి పెరుగుతున్న సమయంలో, వైసీపీ నేతపై కేసు నమోదు కావడం గమనార్హం. అంబటి రాంబాబు మీద నమోదైన ఈ కేసు పట్ల పార్టీ అధిష్టానం ఎలా స్పందించనున్నదన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది.
