Vishaka Crime: ప్రేమ పేరుతో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ఇష్టపడిన అమ్మాయి దక్కలేదని, ఇక దక్కదేమోనని భావించి మృగాళ్లుగా మారుతున్నారు. సదరు యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కన్నెర్ర చేస్తున్నారు. పదునైన ఆయుధాలతో విరుచుకుపడుతున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఘటన వైజాగ్ లోనే చోటుచేసుకోవడంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
గాజువాక నియోజకవర్గం అక్కయ్యపాలెం కి చెందిన మైనర్ బాలికను.. బాలుడు ప్రేమించాడు. ఇద్దరు స్థానిక వాగ్దేవి కాలేజీలో ఇంటర్ చదువుతుండగా వారికి పరిచయం ఏర్పడింది. చదువులతో పాటు ఇద్దరి మనసులు కూడా కలిశాయి. దీంతో వారిద్దరు.. తాము మైనర్లని మర్చిపోయి ఒకరికొకరు ప్రేమ పాఠాలు చెప్పుకున్నారు. ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని ఆ వయసులోనే ప్రతిజ్ఞలు చేసుకున్నారు.
అయితే కుమార్తె తల్లికి విషయం తెలియడంతో బాలికను బాగా మందలించింది. ఆ బాలుడితో మాట్లాడవద్దని హెచ్చరించింది. మరోసారి ఇది రిపీట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని కూతురికి స్పష్టం చేసింది. అదే సమయంలో కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించింది.
Also Read: Crime News: మైనర్ బాలికను కిడ్నప్ చేసి.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు .
తను ప్రేమించిన యువతిని ఆమె తల్లి దూరం పెట్టడాన్ని మైనర్ బాలుడు సహించలేకపోయాడు. దూరాన్ని సహించలేక ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. ఈ క్రమంలో బాలిక ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె తల్లితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా బాలిక తల్లిపై దాడి చేశాడు.
బాధితురాలి కేకలు విని ఒక్కసారిగా చుట్టుపక్కల వారు ఇంటి వద్దకు చేరుకున్నారు. బాలుడ్ని అడ్డుకొని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే మైనర్ కావడంతో ఈ విషయం బయటకు రాకుండా పోలీసులు గోప్యం వహించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయం వెలుగుచూడటంతో అంతా షాకవుతున్నారు.
సరిగ్గా వారం క్రితం విశాఖలోనే మరో ప్రేమోన్మాద ఘటన జరిగింది. తల్లి, కూతురిపై నవీన్ అనే యువకుడు ఇంటికి వెళ్లి మరి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మీ మృతి చెందగగా.. కూతురు దీపిక ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో సీఎం చంద్రబాబు సైతం రియాక్ట్ అయ్యారు. మరోవైపు నిందుతుడు నవీన్ ను శ్రీకాకుళం జిల్లా బూర్జిలో పట్టుకొని పోలీసులు అరెస్టు చేశారు.
