కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రాయ్ స్థానిక పోలీసులతో పౌర వాలంటీర్గా పనిచేస్తున్నారని కోల్కతాలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో సీబీఐ పేర్కొంది.
ఆగస్ట్ 9న బాధితురాలు విశ్రాంతి సమయంలో ఆసుపత్రిలోని సెమినార్ గదిలో నిద్రించడానికి వెళ్లిన సమయంలో అతడు ఈ నేరానికి పాల్పడ్డాడని వారు తెలిపారు. అయితే, ఇందులో గ్యాంగ్ రేప్ అభియోగాన్ని ఏజెన్సీ ప్రస్తావించలేదు. రాయ్ మాత్రమే ఈ నేరానికి పాల్పడ్డాడని సూచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆగస్టు 10న నిందితుడు సంజయ్ రాయ్ని పోలీసులు అరెస్టు చేశారు. కోల్కతా ప్రెసిడెన్సీ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాయ్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. ఈ కేసును టేకప్ చేసిన సీబీఐ.. నిందితుడు సంజయ్ రాయ్కు నార్కో టెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరగా కోల్ కతా కోర్టు నిరాకరించింది. అయితే, దర్యాప్తు సంస్థ ముందుగా నిందితులకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పస్తుతం ఈ కేసులో కోల్ కతా వైద్యుల బృందం ఇంకా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.