Bandi Sanjay: సిద్ధిపేట–గజ్వేల్ రహదారిపై శనివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్ధిపేటలో పరీక్ష రాసిన కూతురిని తీసుకుని కారులో గజ్వేల్ వైపు వెళ్తున్న ఓ కుటుంబం ప్రమాదానికి గురవగా, సమయానికి అక్కడికి చేరుకున్న బండి సంజయ్ స్వయంగా సహాయక చర్యలు చేపట్టి యువతిని తన కాన్వాయ్లోని పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
పరీక్ష రాసి వస్తుండగా ప్రమాదం..
ఓ యువతి సిద్ధిపేటలో పరీక్ష రాసిన అనంతరం తల్లిదండ్రులతో కలిసి కారులో గజ్వేల్కు బయలుదేరింది.మార్గమధ్యంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి రహదారిపై పల్టీలు కొట్టి బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు కారులోని ఎయిర్బ్యాగ్లు వెంటనే తెరుచుకోవడంతో తల్లిదండ్రులు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే వెనుక కూర్చున్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి.
కాన్వాయ్ ఆపి స్వయంగా రెస్క్యూ..
అదే సమయంలో సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రమాదాన్ని గమనించారు. తక్షణమే తన కాన్వాయ్ను నిలిపివేశారు. తన భద్రతా సిబ్బందితో కలిసి రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు వద్దకు వేగంగా చేరుకున్న మంత్రి, అందులో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా బయటకు తీశారు.
కాన్వాయ్ వాహనంలోనే ఆసుపత్రికి..
తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్థిని ఆలస్యం చేయకుండా తన కాన్వాయ్లోని పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో ఎక్కించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, పోలీసులను ఆదేశించారు.
