Revanth Reddy

Revanth Reddy: చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది..!

Revanth Reddy: మనిషికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా.. చదువు లేకపోతే సామాజికంగా వెనుకబడిపోతారు. పేదరికాన్ని జయించి మన తలరాతను మార్చగల ఏకైక ఆయుధం విద్యే! అంటూ తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, సాగునీటి రంగాలకు తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని ప్రకటిస్తూ, భవిష్యత్ తరాల కోసం రాష్ట్ర విద్యా వ్యవస్థలో చేపడుతున్న విప్లవాత్మక మార్పులు, బడ్జెట్ కేటాయింపులను సీఎం సభకు వివరించారు. పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేరన్న విమర్శలకు బదులిస్తూ.. పేద పిల్లలకు నాణ్యమైన చదువు అందాలన్న అమితమైన ఆసక్తితోనే విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్నానని సీఎం తెలిపారు.

బడ్జెట్‌లో ఏటా పెంపు – 15 శాతం కేటాయింపే టార్గెట్..

విద్యా రంగానికి ఏటా నిధులు పెంచుతూ వస్తున్నామని, భవిష్యత్తులో రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతాన్ని విద్యకే కేటాయించడమే తన అంతిమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
  • 2023-24 (గత ప్రభుత్వం): రూ. 18,955 కోట్లు (6.53%)
  • 2024-25: 7 శాతానికి పైగా వ్యయం
  • 2025-26: రూ. 23,729 కోట్లు (8 శాతానికి పైగా)
  • 2026-27: రూ. 27,663 కోట్లు
  • గత మూడేళ్లలో విద్యాశాఖ కోసం అదనంగా రూ. 7,554 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు.

రికార్డు సమయంలో టీచర్ల భర్తీ – విద్యా కమిషన్ ఏర్పాటు..

గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో కేవలం 7,857 ఉపాధ్యాయ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 11,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎలాంటి వివాదాలు, అవినీతి ఆరోపణలకు తావులేకుండా రికార్డు స్థాయిలో కేవలం 55 రోజుల్లోనే 10,600 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశామని తెలిపారు.
రైట్ టు ఎడ్యుకేషన్ (RTE) నిబంధనల ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 17 మంది విద్యార్థులకే ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉండటం గమనార్హం.
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ లేని విధంగా విద్యా సంస్కరణల కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేశామని, నూతన మార్గదర్శకాల రూపకల్పన కోసం కె.కేశవరావు కమిటీని నియమించామని వెల్లడించారు.
పాఠశాలలు, కళాశాలల గణాంకాలు..
రాష్ట్రంలో మొత్తం 24,966 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో 19,79,614 మంది విద్యార్థులు, 1,24,456 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మొత్తం అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల సంఖ్య 28,163 కాగా, వీటిలో 28.77 లక్షల మంది విద్యార్థులు, 1.57 లక్షల మంది బోధనా సిబ్బంది ఉన్నారు. 444 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు 1.95 లక్షల మంది విద్యార్థులు, 6,359 మంది లెక్చరర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. సింగిల్ టీచర్ స్కూళ్ల సమస్యను అధిగమించేందుకు, ప్రతి 3 కిలోమీటర్ల పరిధిలో ఒక పటిష్టమైన ప్రాథమిక పాఠశాల ఉండేలా క్షేత్రస్థాయి విద్యా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
గ్లోబల్ పోటీకి విద్యార్థులను సిద్ధం చేస్తాం..

బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలోనే తమ ప్రభుత్వం పయనిస్తోందని సీఎం అన్నారు. పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ వేసిన పునాదులపైనే దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు నడుస్తున్నాయని గుర్తుచేశారు. సీపెక్ సర్వేలో తేలిన వాస్తవాల ఆధారంగా, సంప్రదాయ ఆలోచనల నుంచి విద్యార్థులను బయటకు తెచ్చి నైపుణ్య శిక్షణ (స్కిల్ డెవలప్‌మెంట్) అందించడం ద్వారా ‘జెన్-జీ’, రాబోయే తరాలను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *