Chandrababu

Chandrababu: జలం ఉంటేనే జీవం.. నీరు ఉంటేనే సాగు..!

Chandrababu: ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి రంగంలో చారిత్రాత్మక అధ్యాయం మొదలైంది. నాలుగు నదులు, తూర్పు కనుమలు, అడవులు, జాతీయ రహదారులను దాటుకుంటూ పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా తరలివచ్చిన గోదావరి జలాలు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటను తాకాయి. పాయకరావుపేట వద్ద గోదారమ్మకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పసుపు, కుంకుమ, చీర, పండ్లు సమర్పించి జలహారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ ప్రాజెక్టు ప్రాధాన్యతను, ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను వివరించారు.

 సింహాద్రి అప్పన్న, అరసవెల్లి వరకు గోదావరి జలాలు..

వచ్చే ఏడాది నాటికి సింహాద్రి అప్పన్న చెంతకు, ఆపై అరసవెల్లి సూర్యనారాయణ స్వామి పాదాల చెంతకు గోదావరి జలాలను తీసుకెళ్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి చేసి తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు.
సాగునీటి ప్రాజెక్టులను తాను ఆధునిక దేవాలయాలుగా భావిస్తానని పేర్కొన్నారు. “జలం ఉంటేనే జీవం.. నీరు ఉంటేనే సాగు.. బాగు. పరిశ్రమలు, ఉపాధి, భవిష్యత్ అన్నీ నీటితోనే ముడిపడి ఉన్నాయి. కృష్ణా, గోదావరి జీవనదుల ద్వారా ప్రజలకు మేలు జరగడమే నా జీవితాశయం” అని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 12 కీలక ప్రాజెక్టులను 2028 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లను ఉపేక్షించబోమని, అవసరమైతే జైలుకు పంపుతానని హెచ్చరించారు.

తొలిదశ లక్ష్యాలు – ఇంజనీరింగ్ విజయం..

తొలి దశలో 2.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 5.23 లక్షల మందికి శాశ్వత తాగునీరు అందించనున్నారు. భవిష్యత్‌లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం చేసి 89 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు.
పంపా, తాండవ, వరాహ, శారద నదుల మీదుగా సైఫన్లు, అక్విడెక్టుల ద్వారా నీటిని తరలించారు. పంపా నదిపై 30 మీటర్ల లోతున 312 పైల్స్‌తో అక్విడెక్ట్ నిర్మించడం, ఏలేరు నది బెడ్ లెవల్ కింద నుంచి సైఫన్ ద్వారా నీటిని మళ్లించడం ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనమని సీఎం కొనియాడారు.

ప్రతిపక్ష వైఖరిపై విమర్శలు..

2019లో అధికారంలోకి వచ్చిన ‘గొడ్డలి పార్టీ’ పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారిందని, 2024లో కూటమిని గెలిపించి ప్రజలు ఆ శాపాన్ని తొలగించారని విమర్శించారు.

విశాఖకు డేటా సెంటర్లు సహా అంతర్జాతీయ సంస్థలు వస్తే 5 టీఎంసీలే కాదు.. 500 టీఎంసీల నీటిని తరలించే శక్తి ప్రభుత్వానికి ఉందని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ విస్తరణతో ఉత్తరాంధ్ర.. “ఉత్తమాంధ్ర, ఉన్నతాంధ్ర”గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *