Tamilnadu: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో అత్యంత విలువైన పురాతన విగ్రహం చోరీకి గురవడం భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చెంగల్పట్టు జిల్లా మధురాంతకం తాలూకా అచ్చిరుపాక్కం సమీపంలోని పెరుక్కరణై గ్రామంలో ఉన్న ప్రముఖ నడుపళని మరకత దండాయుధపాణి ఆలయంలో దుండగులు చొరబడి పచ్చల (మరకత) మురుగన్ విగ్రహాన్ని అపహరించుకుపోయారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ అరుదైన మరకత విగ్రహం విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
రంగంలోకి పోలీసులు – ప్రత్యేక బృందాలతో గాలింపు:
ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సిత్తామూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. విగ్రహ విలువను అధికారికంగా మదింపు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, అంతర్రాష్ట్ర ముఠాల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.
