Road Accident

Road Accident: కంటైనర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. ఆరుగురు దుర్మరణం.. రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి!

Road Accident: సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో బుధవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ఏలూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటైనర్‌ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద సమయంలో బస్సులోని ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో తప్పించుకోలేకపోయారు. స్థానికులు, హైవే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

బాధితులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు..

ఈ దుర్ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అయన. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) ఆదేశించారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం బాధితులను హైదరాబాద్‌లోని పెద్ద ఆసుపత్రులకు తరలించాలని సీఎంవో ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సహాయక చర్యల్లో ఏపీ యంత్రాంగం – పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి..

బస్సు ఏలూరు వెళ్తుండటంతో ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు మరణించడంపై విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, సహాయక చర్యల కోసం తెలంగాణ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఏపీ అధికారులను ఆదేశించారు. దీంతో ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై, సూర్యాపేట పోలీసులతో సమన్వయం చేసుకుంటూ బాధితుల వివరాలు సేకరిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *