Golconda Secret Tunnel: హైదరాబాద్లోని గోల్కొండ కోట పరిసరాల్లో ఓ రహస్య సొరంగం బయటపడిందన్న వార్త ఒక్కసారిగా తీవ్ర సంచలనం రేపింది. కోట వెలుపలి ప్రాకారంలో భూగర్భ మార్గం వెలుగుచూసిందనే సమాచారం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో.. స్థానిక ప్రజలు, నగరవాసులు, పర్యాటకులు ఆ వింతను కళ్లారా చూసేందుకు కోట వద్దకు భారీగా తరలివచ్చారు.
గోల్కొండ పరిధిలోని ‘18 సీడీ’ (అథర సీడీ) ప్రాంతంలో గల 400 ఏళ్ల పురాతన కుతుబ్ షాహీ మైదానం వద్ద చేపట్టిన తవ్వకాల్లో ఈ నిర్మాణం బయటపడినట్లు తెలుస్తోంది.
ASI దృష్టికి తీసుకెళ్లిన స్థానిక ఎమ్మెల్యే..
ఈ పరిణామంపై కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ స్పందిస్తూ వివరాలను వెల్లడించారు..
-
అనుమతులు లేని తవ్వకాలు?: స్థానిక 18 సీడీ ప్రాంతంలోని పురాతన స్థలంలో సైనిక అధికారులు చేపట్టిన తవ్వకాల సమయంలో ఈ సొరంగం లాంటి మార్గం కనిపించిందని ఆయన పేర్కొన్నారు.
-
పురావస్తు శాఖకు ఫిర్యాదు: ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు.. ఈ ప్రాధాన్యం గల నిర్మాణానికి సంబంధించి భారత పురావస్తు శాఖ (ASI) సూపరింటెండెంట్తో మాట్లాడి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
-
స్థల వివాదం: ఈ అథర సీడీ మైదానం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. ఆర్మీ అధికారులు ఆ భూమి తమదేనని పేర్కొంటుండగా, స్థానికులు దానిని స్మశానవాటికగా, పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని యువకులు ఆట మైదానంగా వాడుకుంటున్నారు.
గోల్కొండ సొరంగాలు – చరిత్ర ఏం చెబుతోంది?..
కాకతీయుల కాలం నుంచి కుతుబ్ షాహీల వరకు శతాబ్దాల వైభవాన్ని చూసిన గోల్కొండ కోట చుట్టూ ఎన్నో రహస్య కథలు, వదంతులు ప్రచారంలో ఉన్నాయి..
-
నగరంతో అనుసంధానం: శత్రువుల దాడి జరిగినప్పుడు తప్పించుకోవడానికి కోట నుంచి చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, గోషామహల్, నౌబత్ పహాడ్ వంటి కీలక ప్రాంతాలకు భూగర్భ రహస్య మార్గాలు ఉండేవని ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది.
-
రాజ నిధుల కథలు: కొన్ని సొరంగాల్లో నిజాం, కుతుబ్ షాహీల కాలం నాటి అపార సంపద దాగి ఉందని కథలు ప్రచారంలో ఉన్నాయి.
-
పురావస్తు వాస్తవాలు: అయితే గతంలో జరిగిన పరిశోధనల్లో బయటపడిన చాలా నిర్మాణాలు.. శత్రువుల కోసం నిర్మించిన చిన్న కందకాలు, నీటి సరఫరా వ్యవస్థలు లేదా భూమిలో కూరుకుపోయిన రాజభవనాల పునాదులుగానే తేలాయి.
ప్రస్తుతం బయటపడిన నిర్మాణం నిజంగానే రహస్య మార్గమా లేక పాత కట్టడాల అవశేషమా అనేది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆర్మీ వర్గాలు స్పందించిన తర్వాతే అధికారికంగా స్పష్టత రానుంది.
