Sai Krishna Case: కృష్ణాంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సాయి కృష్ణ కస్టడీ మరణం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ సుడా సురేష్ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
1. హైకోర్టు ఉత్తర్వుల రద్దు.. సిట్ విచారణకు గ్రీన్ సిగ్నల్
గతంలో విచారణను రాజమహేంద్రవరం జైలుకే పరిమితం చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది.విజయవాడలోని ప్రత్యేక విచారణ బృందం (SIT) కేంద్రంలోనే సీఐ సురేష్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం నిందితుడికి 7 రోజుల పాటు పోలీస్ కస్టడీ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
2. కీలక ఆధారాల సేకరణే లక్ష్యం
మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, డిలీట్ అయిన సీసీటీవీ (CCTV) హార్డ్ డిస్క్లను రికవరీ చేసేందుకు అధికారులకు పూర్తి విచారణ స్వేచ్ఛను సుప్రీంకోర్టు కల్పించింది.
3. వీడియో రికార్డింగ్, న్యాయవాది సమక్షంపై స్పష్టత
కేవలం విచారణ సమయాన్ని మాత్రమే రికార్డ్ చేయాలని, 160 కిలోమీటర్ల ప్రయాణ సమయాన్ని (Transit) రికార్డ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.BNSS సెక్షన్ 38 ప్రకారం.. విచారణ సమయంలో లాయర్ దూరం నుంచి చూడటానికి మాత్రమే అనుమతి ఉందని, విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని వెల్లడించింది.
అలాగే నిందితుడిపై ఎలాంటి థర్డ్ డిగ్రీ గానీ, వేధింపులు గానీ ఉండకూడదని, అతని భద్రత పూర్తి బాధ్యత సిట్ అధికారులదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
