Skyroot Aerospace: భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడబోతోంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace) సరికొత్త చరిత్ర సృష్టించడానికి సర్వం సిద్ధం చేసుకుంది. దేశంలోనే పూర్తి స్వదేశీ సాంకేతికతతో, ఒక ప్రైవేట్ సంస్థ నిర్మించిన మొట్టమొదటి ఆర్బిటల్ లాంచ్ వెహికల్ (ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లే రాకెట్) ‘విక్రమ్-1’ (Vikram-1) శనివారం నాడు (జూలై 18, 2026) నింగిలోకి దూసుకెళ్లనుంది.
శ్రీహరికోట నుండి నింగిలోకి.. టైమింగ్స్ ఇవే!
ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC-SHAR) మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఈ రాకెట్ ప్రయోగం జరగనుంది. శనివారం ఉదయం 11:30 గంటలకు విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేలా శాస్త్రవేత్తలు సమయాన్ని ఖరారు చేశారు.
ఈ ప్రయోగానికి సంబంధించి అవసరమైన అన్ని రకాల వైమానిక (Airspace), సముద్రయాన (Maritime) అనుమతులను స్కైరూట్ సంస్థ ఇప్పటికే సాధించింది. రాకెట్ ప్రయాణించే మార్గంలో, అలాగే అది బూస్టర్లను వదిలేసే ప్రాంతాల్లో ముందస్తుగా రక్షిత మండలాలను (Restricted Zones) అధికారులు ప్రకటించారు.
గ్లోబల్ మార్కెట్లోకి భారత్ ఎంట్రీ.. రెండో ప్రయోగం!
విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైతే.. ప్రపంచ ప్రైవేట్ అంతరిక్ష ఉపగ్రహాల లాంచ్ మార్కెట్లోకి భారతదేశం అధికారికంగా అడుగుపెడుతుంది. గ్లోబల్ కమర్షియల్ స్పేస్ మార్కెట్లో భారత్ స్థానం మరింత బలోపేతం అవుతుంది.
స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు ఇది రెండో అంతరిక్ష ప్రయోగం. అంతకుముందు నవంబర్ 18, 2022న ‘విక్రమ్-S’ అనే సబ్-ఆర్బిటల్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించి ఈ సంస్థ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
రాకెట్లో పీఎం మోదీ “వందేమాతరం” సందేశం!
ఈ చారిత్రాత్మక ప్రయోగానికి మరింత ప్రత్యేకతను చేకూరుస్తూ ఒక అద్భుతమైన సంకేతాన్ని జోడించారు.
-
పీఎం మోదీ పోస్ట్కార్డ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత చేతిరాతతో “వందేమాతరం” అని రాసిన ఒక పోస్ట్కార్డ్ ఈ విక్రమ్-1 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణించనుంది.
-
మిలియన్ల మంది ఆకాంక్షలు: ప్రధాని సందేశంతో పాటు స్కైరూట్ టీమ్ సభ్యులు, పెట్టుబడిదారులు (Investors), పాలసీ మేకర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు రాసిన హ్యాండ్రిటన్ నోట్స్ (చేతిరాత పత్రాలు) కూడా ఈ రాకెట్ మోసుకెళ్తోంది. భారతదేశపు సరికొత్త ప్రైవేట్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ వెనుక ఉన్న మిలియన్ల మంది సామూహిక మద్దతుకు, ఆకాంక్షలకు ఈ జ్ఞాపకాలు ప్రతీకలని స్కైరూట్ సంస్థ పేర్కొంది.
ఈ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా మన దేశీయ ప్రైవేట్ సంస్థల రాకెట్ లాంచ్ సామర్థ్యం ప్రపంచానికి చాటిచెప్పినట్లవుతుందని, వాణిజ్య ఉపగ్రహాల మార్కెట్లో సరికొత్త బిజినెస్ అవకాశాలు తలుపు తడతాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
