No Welfare Benefits: మహిళల హక్కులను కాపాడటం, సమాజంలో అందరికీ న్యాయం చేయడమే లక్ష్యంగా అసోం ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో భాగంగా.. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే (బహుభార్యత్వం పాటించే) పురుషులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పూర్తిగా కట్ చేయాలని ప్రతిపాదించింది. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలితే.. వారిని ఉద్యోగం నుంచి తొలగించేలా పాత నియమాలను మార్చాలని నిర్ణయించింది. శుక్రవారం నాడు అసోం ఆర్థిక మంత్రి జయంత మల్ల బరువా అసెంబ్లీలో తన మొదటి బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఈ విషయాలను ప్రకటించారు. సమాజంలో నైతిక విలువలు, బాధ్యత పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఏదైనా నేరం చేసి కోర్టులో దోషిగా తేలిన వ్యక్తులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల పైసలు అందవు. మహిళల రక్షణ కోసం, సమాజంలో మార్పు కోసం ఈ కఠినమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది అసోం ప్రభుత్వం మొత్తం రూ.2,85,084 కోట్లతో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. గత ఐదేళ్లలో మొదలుపెట్టిన మంచి సంక్షేమ పథకాలన్నింటినీ ఇలాగే కొనసాగిస్తామని, వాటి కోసం రూ.6,000 కోట్లకు పైగా కేటాయిస్తున్నామని మంత్రి చెప్పారు. ఎన్నికల వల్లే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం కాస్త ఆలస్యమైందని, వచ్చే ఆగస్టు నెల నుండి అన్ని సంక్షేమ పథకాలు యథావిధిగా ప్రజలకు అందుతాయని స్పష్టం చేశారు.
ఈ బడ్జెట్లో సామాన్యులకు, చిన్న వ్యాపారులకు కూడా కొన్ని మంచి రాయితీలు ఇచ్చారు. చిన్న చిన్న టీ తోటలు నడుపుకునే యజమానులకు ఇచ్చే పన్ను మినహాయింపును ఏకంగా నాలుగు రెట్లు పెంచారు. అలాగే ఇళ్లలో పైప్లైన్ ద్వారా వాడుకునే వంట గ్యాస్ (PNG) పై ఉన్న వ్యాట్ (VAT) పన్నును దాదాపు 10 శాతం మేర తగ్గించారు. ఇకపై ప్రభుత్వ పథకాల డబ్బులు తప్పుడు వ్యక్తుల చేతికి వెళ్లకుండా ఉండటం కోసం.. ఆధార్ కార్డు లింక్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే డిజిటల్ పద్ధతిలో డబ్బులు జమ చేయనున్నారు. ఈ కొత్త రూల్స్ ద్వారా ప్రభుత్వ పథకాలలో అవినీతిని అరికట్టడంతో పాటు మహిళలకు సమాజంలో మంచి గౌరవం దక్కేలా చేయడం అసోం ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.
