Prashna Ravan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లతో పాటు హిందూ దేవతలను, ప్రజాప్రతినిధులను కించపరుస్తూ సోషల్ మీడియాలో విద్వేషపూరిత వీడియోలు పెట్టిన వివాదాస్పద యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘రావణ్’ ఆర్థిక వనరులపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. తన ‘ప్రశ్న’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా సమాజంలో కులమతాల మధ్య గొడవలు రేపేలా వీడియోలు అప్లోడ్ చేస్తూ, రావణ్ నెలకు రూ.1.50 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఆర్థిక లావాదేవీలను గుర్తించిన కాకినాడ పోలీసులు.. రావణ్కు ఖాతాలు ఉన్న ఐసీఐసీఐ, యస్ బ్యాంకులకు లేఖలు రాయడంతో అధికారులు ఆ బ్యాంకు అకౌంట్లను తక్షణమే నిలిపివేశారు (ఫ్రీజ్ చేశారు).
నిషేధిత మావోయిస్టు సంస్థలకు మద్దతుగా మాట్లాడటం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన కేసుల్లో అరెస్టయిన రావణ్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా జులై 2న రావణ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL)కు పంపించగా.. తాజాగా అందిన ఆ నివేదికలో మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు పట్టుకునే ముందే రావణ్ తన ఫోన్ లోని డేటాను డిలీట్ చేయగా, ఫోరెన్సిక్ నిపుణులు ఆ డేటాను, వాట్సాప్ చాటింగ్లను విజయవంతంగా రికవరీ చేశారు.
ఈ రికవరీ చేసిన డేటాలో రావణ్ పలువురు అమాయక యువతులతో సాగించిన రాసలీలల వీడియోలు బయటపడ్డాయి. నలుగురైదుగురు అమ్మాయిలతో హోటల్ గదుల్లో అసభ్యంగా, అశ్లీలంగా గడుపుతూ స్వయంగా తీసుకున్న వీడియోలను పోలీసులు గుర్తించారు. సమాజంలో పెద్ద పెద్ద హితబోధలు చేసే రావణ్.. బయటపడిన వీడియోల్లోని అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి, బెదిరించి లోబరుచుకుని ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ దారుణాల వెనుక రావణ్ ఒక్కడే ఉన్నాడా? లేక అతని వెనుక ఉండి నడిపిస్తున్న సూత్రధారులు, ప్రోత్సహిస్తున్న పెద్దలు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
