Bandla Ganesh

Bandla Ganesh: జూబ్లీహిల్స్ ఆస్తి వేలం సబబేనన్న న్యాయస్థానం.. సుప్రంకోర్టుకు వెళ్తానన్న గణేశ్!

Bandla Ganesh: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న బండ్ల గణేశ్ కుటుంబ ఆస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. గతంలో ఈ వేలాన్ని రద్దు చేస్తూ రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (DRT) ఇచ్చిన తీర్పును హైకోర్టు పూర్తిగా పక్కనబెట్టింది. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్న రుణ బకాయిల వసూళ్లలో భాగంగా.. గ్యారంటర్లుగా ఉన్న బండ్ల గణేశ్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తిని బ్యాంక్ వేలం వేయడం సబబేనని కోర్టు స్పష్టం చేసింది.

బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు రుణ బకాయిల రికవరీ కోసం 2019లోనే ‘సర్ఫేసి’ (SARFAESI) చట్టం కింద ఈ ఆస్తిని బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. అనంతరం 2022లో నిర్వహించిన బహిరంగ వేలంలో ఈ స్థిరాస్తి రూ. 8.51 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే, వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) ఒప్పందంలో భాగంగా తాము అన్ని రకాల చట్టపరమైన సవాళ్లను ఉపసంహరించుకుంటామని బండ్ల గణేశ్ కుటుంబం ముందే అంగీకరించిందని, కానీ ఆ తర్వాత మాట మార్చి డీఆర్‌టీని ఆశ్రయించారని బ్యాంక్ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. దివాలా నిబంధనల ఆంక్షలు కంపెనీకి వర్తిస్తాయి తప్ప, పర్సనల్ గ్యారంటర్లుగా ఉన్న బండ్ల గణేశ్ ఆస్తుల వేలానికి అడ్డుకావని తేల్చిచెప్పింది.

ఈ హైకోర్టు తీర్పుపై నిర్మాత బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. బ్యాంకు అధికారులు తీవ్ర అన్యాయానికి ఒడిగట్టారని, లోపాయికారీ ఒప్పందాలతో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు తన ఆస్తిని విక్రయించేశారని ఆరోపించారు. “ఈ అన్యాయాన్ని సవాలు చేస్తూ 2022లో నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. కింది డీఆర్‌టీ (DRT) లో నాకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ, తాజాగా హైకోర్టులో వ్యతిరేక నిర్ణయం వెలువడింది. అయినప్పటికీ నాకు భారత న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. ఈ కేసుపై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించి, నా హక్కుల ఆధారంగా నిజాయతీగా న్యాయం సాధిస్తాననే అచంచలమైన నమ్మకం నాకు ఉంది” అంటూ బండ్ల గణేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *