Ramalinga Reddy: కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటై కనీసం నెల రోజులు కూడా గడవక ముందే.. కీలక నేత, నీటి పారుదలశాఖ మంత్రి రామలింగారెడ్డి తన మంత్రి పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
నగరాభివృద్ధి శాఖ అడిగితే.. నీటి పారుదలశాఖ ఇచ్చారని అసహనం!
రామలింగారెడ్డి రాజీనామా వెనుక ఉన్న ప్రధాన కారణం శాఖల కేటాయింపేనని స్పష్టమవుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో తనకు నగరాభివృద్ధి శాఖ (Urban Development) కేటాయించాలని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని, ముఖ్యమంత్రిని గట్టిగా విజ్ఞప్తి చేశారు. అయితే, దానికి భిన్నంగా ఆయనకు నీటి పారుదలశాఖ (Irrigation) ను కేటాయించారు.
తనకు ఏమాత్రం అవగాహన లేని, ఇష్టం లేని శాఖను కేటాయించడంపై రామలింగారెడ్డి గత కొన్ని రోజులుగా తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
“మంత్రి పదవి వద్దు.. ఎమ్మెల్యేగా కొనసాగుతా”
రాజీనామా అనంతరం రామలింగారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకు అవగాహన లేని శాఖలో ఉండి ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి వద్దని, కేవలం ఎమ్మెల్యే (MLA) గానే కొనసాగుతూ తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని ఆయన తేల్చి చెప్పారు.
కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన నెల రోజుల లోపే ఒక సీనియర్ మంత్రి ఇలా ఓపెన్గా అసంతృప్తి వెళ్లగక్కుతూ రాజీనామా చేయడం కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీని రక్షణలో పడేసింది. ఈ సంక్షోభాన్ని అధిష్టానం ఎలా సర్దుమణిగిస్తుందో చూడాలి.
