Deeply In Love: ప్రేమ కోసం ఎంతటి సాహసానికైనా వెనకాడరని చెప్పడానికి ఒక వింత నిజ జీవిత సంఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం తన ప్రియురాలిని కలుసుకోవడం కోసం ప్రాణాలకు తెగించి నియంత్రణ రేఖ (LoC) దాటి భారత సరిహద్దుల్లోకి అడుగుపెట్టిన ఒక పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) యువకుడిని భారత సైన్యం అరెస్ట్ చేసింది.
ఈ ఆసక్తికరమైన ఘటన ఆదివారం (మే 31, 2026) ఉదయం సుమారు 9:30 గంటల ప్రాంతంలో జరిగింది. సియాల్కోట్ సరిహద్దును దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఆ యువకుడిని ఆర్మీకి చెందిన ’12 గ్రెనేడియర్స్ యూనిట్’ సిబ్బంది అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నారు.
అసలు ఏం జరిగింది?
భద్రతా సంస్థల వివరాల ప్రకారం.. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ జిల్లా, పైన్కాడి గ్రామానికి చెందిన జీషాన్ అహ్మద్ మీర్ (22) అనే యువకుడు సరిహద్దు దాటి వచ్చాడు. ఇతను బారాముల్లా జిల్లా ఊరి ప్రాంతానికి చెందిన ఇరమ్ బానో అనే అమ్మాయితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఎలాగైనా తన ప్రియురాలిని చూడాలనే పిచ్చితోనే అతను ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దులు దాటినట్లు ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నాడు.
ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన భారత సైన్యం సదరు యువకుడితో పాటు, అతనికి సహకరించిన ప్రియురాలిని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆర్మీతో పాటు వివిధ నిఘా సంస్థల అధికారులు వీరిద్దరినీ కలిపి విచారిస్తున్నారు.
దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు
పట్టుబడిన యువకుడి నుంచి పాకిస్తానీ జాతీయ గుర్తింపు కార్డు (ID) తో పాటు కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కార్డులపై అతని వివరాలు ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉన్నాయి. ప్రస్తుతం వీరిని విచారిస్తున్న ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చింది.
ఇది కేవలం ఒక ప్రేమ వ్యవహారమేనా? లేక దీని వెనుక దేశ భద్రతకు ముప్పు తెచ్చే ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే కోణంలో అధికారులు అన్ని వైపుల నుంచి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
