Arava Sridhar: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. 2026 మే 23న మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అయిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పవన్తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే శ్రీధర్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
రాజీనామాకు ‘వ్యక్తిగత కారణాలే’ కారణమా?
తన రాజీనామాపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందిస్తూ.. కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తాను విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని ఇచ్చినందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని అనివార్య వ్యక్తిగత కారణాల వల్ల ఈ పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేనని, అందుకే తప్పుకుంటున్నట్లు ఆయన వివరించారు.
అయితే, ఈ సుదీర్ఘ భేటీలో పవన్ కళ్యాణే ఆయనను రాజీనామా చేయాలని కోరారా? లేక అరవ శ్రీధర్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే అంశంపై జనసేన వర్గాల నుండి ఇంకా స్పష్టమైన అధికారిక ప్రకటన రాలేదు.
తెరపైకి లైంగిక ఆరోపణల వివాదం..
అరవ శ్రీధర్ కేవలం వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని చెబుతున్నప్పటికీ.. దీని వెనుక ఇటీవల ఆయనపై వచ్చిన వివాదాస్పద ఆరోపణలే కారణమనే ప్రచారం గట్టిగా సాగుతోంది. కొద్దిరోజుల క్రితం ఒక మహిళా ఉద్యోగి ఆయనపై లైంగిక ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. అప్పటి నుండి ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా కాస్త దూరంగానే ఉంటున్నారు.
పార్టీ త్రిసభ్య కమిటీ విచారణ: ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. దీనిపై విచారణ జరిపేందుకు ఒక త్రిసభ్య కమిటీని కూడా వేశారు. ఈ విచారణలో భాగంగా ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఆ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవన్నీ అవాస్తవాలని కమిటీకి వివరణ ఇచ్చారు.
కానీ, ఇప్పటికీ సదరు బాధితురాలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుండటంతో.. పార్టీ ప్రతిష్టకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే విప్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా అధినేత పవన్ కళ్యాణ్ ఆయనను కోరినట్లు ఇండస్ట్రీ, పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా టాక్ నడుస్తోంది.
