Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వడగాల్పుల తీవ్రత పెరుగుతుండటంతో వాతావరణ శాఖ ‘హీట్ వేవ్’ అలర్ట్ జారీ చేసింది. భానుడి ప్రతాపంతో పాటు ఉక్కబోత, వడగాల్పులు తోడవ్వడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో కూడా అనేక మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడ్డాయి.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని స్పష్టం చేసింది. ఉదయం 8 గంటల నుంచే ఎండ ప్రభావం మొదలవుతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కడపలో 44.4 డిగ్రీలు, నంద్యాలలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, మన్యం జిల్లాల్లోని దాదాపు 33 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. నిజామాబాద్లో అత్యధికంగా 43.2 డిగ్రీలు నమోదు కాగా, హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. దురదృష్టవశాత్తు వడదెబ్బ కారణంగా తెలంగాణలో నలుగురు మృతి చెందడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ ఎండల నుంచి రక్షణ పొందడానికి వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా గొడుగు లేదా టోపీ ధరించాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచూ నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని కోరింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఎండ దెబ్బకు గురికాకుండా జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
