Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు చిత్ర బృందం అదిరిపోయే తీపి కబురు అందించింది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట సోషల్ మీడియాను ఏ రేంజ్లో ఊపేసిందో మనందరికీ తెలిసిందే. ఆ పాటలోని చరణ్ స్టెప్పులు, మ్యూజిక్ కుర్రకారును ఫిదా చేశాయి. ఇప్పుడు అదే జోష్ను కొనసాగిస్తూ, ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
‘రయ్ రయ్ రా రా’ అంటూ సాగే ఈ సెకండ్ సింగిల్ను మార్చి 2న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. ఈ పాట మిమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది అని పేర్కొన్నారు. మొదటి పాటలాగే ఇది కూడా చార్ట్బస్టర్గా నిలుస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
మరోవైపు, ఈ సినిమా విడుదల తేదీలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, షూటింగ్ మరియు గ్రాఫిక్స్ పనులు మరికొంత మిగిలి ఉండటంతో, నాణ్యత విషయంలో ఎక్కడా తగ్గకూడదని భావించిన చిత్ర బృందం సినిమాను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. లేట్ అయినా సరే, థియేటర్లలో మెగా మాస్ ట్రీట్ గ్యారెంటీ అని సినీ వర్గాలు చెబుతున్నాయి.
