Bandi Sanjay: తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పాల్సింది పోయి దాడులకు దిగడం ఏంటని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేక రౌడీ రాజ్యం నడుస్తోందా? అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మళ్లీ పాత ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే అల్లర్లను ప్రోత్సహించడం దుర్మార్గమని విమర్శించారు. కాంగ్రెస్ మరియు ఎంఐఎం పార్టీలు చేతులు కలిపి రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నాయని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బాన్సువాడలో అన్యాయంగా 70 మందిని అరెస్ట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాళ్ల దాడి జరుగుతున్నట్లు ఆధారాలు కనిపిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. బాన్సువాడ వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అన్యాయమని, ఇది కేవలం ఎంఐఎం నేతలను కాపాడేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమని ఆయన విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు ఈ అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
